తారా కళాశాలలో ‘మన ఉత్పత్తులు.. మన అంగడి’
ఆకట్టుకున్న ప్రదర్శన
రుచికరమైన వంటలకు భలే గిరాకీ
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 29: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పంటలు పండించి వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘మన ఉత్పత్తులు.. మన అంగడి’లో విద్యార్థులు సందడి చేశారు. వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు చేశారు. రాగి అంబలి, గుమ్మడికాయ జ్యూస్, నువ్వులు, వేరుశనగలు, వివిధ సన్నపంటలతో తయారు చేసిన చిక్కీలు, రాగులతో తయారు చేసిన మిఠాయిలు, జొన్న రొట్టెలు, అరిశలు తదితర రుచికరమైన వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చదువులోనే కాదు స్వయం ఉపాధిలోనూ రాణిస్తామంటున్నారు విద్యార్థులు. తమ ప్రతిభను చాటేందుకు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల వేదికైంది. బుధవా రం కళాశాలలో ఏర్పాటు చేసిన ‘మన ఉత్పత్తులు-మన అంగడి’లో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. తమకు ఇష్టమైన వివిధ వృత్తులను ప్రదర్శించారు. రుచికరమైన వంటకాలతో సందర్శకులను ఆకట్టుకున్నారు. రవ్వ లడ్డూలు, నువ్వు ల లడ్డూలు, అరిశలు, పరోటాలు కొనేందుకు పోటీ పడ్డారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల మసాల టీలు ఆకట్టుకున్నాయి.
వ్యాపారాల్లో రాణించొచ్చు
తారా కళాశాలలో ఏర్పాటు చేసిన ‘మన ఉత్పత్తులు-మన అంగడి’ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త కలగూరగంప శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణతో కలిసి ఆమె ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వంటకాలను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమకు ఉన్న నైపుణ్యంతో సొంతంగా వ్యాపారాల్లో రాణించవచ్చని సూచించారు. పట్టుదల, కృషి ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ మాట్లాడుతూ..రాష్ట్రంలోఎక్కువగా రైతులు ఉన్నారని, వారు పండించిన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లభించినప్పుడే గొప్పగా ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఉపేందర్, డాక్టర్ వెంకటేశం, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పద్మజ, సిద్ధులు, ఎన్సీసీ అధికారి మనోజ్కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.