సొంతూరుకే చెందిన స్నేహితుడంటే మరో మిత్రుడికి చాలా ఇష్టం. ఎంతలా అంటే, ప్రియనేస్తం అడగడమే తరువాయి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టేంతగా. అయితే, మొదటి మిత్రుడి వ్యాపారం అంతా అక్రమాల పుట్ట అంటూ ఓ వార్త ఉరుములా విరుచుకుపడింది. వారంలోనే అది కార్చిచ్చులా మారి అతని వ్యాపార సామ్రాజ్యాన్నే దహిస్తున్నది. ఆ సెగ చివరకు.. రెండో మిత్రుడి పీఠానికీ తగిలింది. దీంతో మిత్రుడి వ్యాపారమే తెలియదు.. అంటూ రెండో మిత్రుడు చెప్పుకొనే పరిస్థితి దాపురించింది. ఈ కథలో మొదటి మిత్రుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, రెండో మిత్రుడు నరేంద్ర మోదీ.
(స్పెషల్ టాస్క్ బ్యూరో):హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): అదానీ పవర్తో 2017లో కుదుర్చుకొన్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ఆర్థికంగా తమకు నష్టదాయకంగా ఉన్నదని, ఆ డీల్లో సవరణలు చేయాలని పట్టుబడుతూ బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు (బీపీడీబీ) చేసిన సూచనలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి. కారణం.. ఈ ఒప్పందం కుదర్చడంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ భాగమవ్వడమే. అక్రమ లావాదేవీలు, మోసపూరిత కార్యకలాపాలు జరిపినట్టు అదానీ గ్రూప్ ఆరోపణలను ఎదుర్కొంటుండటం, ఇదే సమయంలో ఈ డీల్ వివాదంగా మారడంతో కేంద్రం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. ఆ ఒప్పందం ఓ సార్వభౌమ ప్రభుత్వం (బంగ్లాదేశ్ సర్కారు), ఓ భారతీయ కంపెనీ మధ్య జరిగిందని, దీంట్లో తమ ప్రభుత్వాన్ని లాగొద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ మీడియాకు తెలిపారు. అయితే 2017 నవంబర్లో ఈ ఒప్పందం కుదిరిన సమయంలో ఇది తమ దౌత్య విజయంగా కేంద్రం చెప్పుకోవడం గమనార్హం.
ఏమిటీ డీల్?
అదానీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ దౌత్య సంబంధాలను కూడా తాకట్టు పెట్టారని గత డిసెంబర్లో ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రత్యేక కథనంలో వెలువరించింది. ఈ మేరకు జార్ఖండ్లోని గొడ్డాలో ఏర్పాటైన అదానీ పవర్ ప్లాంట్ను ఊటంకించింది. 2015 జూన్లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. దౌత్య, వాణిజ్య సంబంధాల బలోపేతంలో భాగంగా ఆ దేశంతో రూ.4.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. బంగ్లాలో పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని షేక్ హసీనాకు హామీ ఇచ్చారు. అయితే గొడ్డాలో నిర్మించనున్న అదానీ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలని, అదానీకి చెందిన విద్యుదుత్పత్తి, ట్రాన్స్మిషన్ కంపెనీలను బంగ్లాలో స్థాపించేందుకు అనుమతినివ్వాలని మెలిక పెట్టారు. దీంతో డిమాండ్ కంటే 40 శాతం అదనంగా విద్యుదుత్పత్తి చేసే సామ ర్థ్యం ఉన్నప్పటికీ హసీనా 25 ఏండ్ల పాటు కొనసాగే ఈ డీల్కు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొన్నారు. ఆ వెంటనే స్వదేశానికి వచ్చిన ప్రధాని హడావుడిగా గొడ్డా అదానీ పవర్ ప్లాంట్కు అనుమతులు మంజూరు చేయడమే కాకుండా శంకుస్థాపన కూడా చేశారు.
బంగ్లా అభ్యంతరం ఏమిటీ?
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. గొడ్డా అదానీ ప్లాంట్లో విద్యుదుత్పత్తి జరుగుతున్నప్పటికీ, ట్రాన్స్మిషన్ లైన్స్ ఏర్పాటు పూర్తికాకపోవడంతో బంగ్లాకు విద్యుత్తు సరఫరా జరుగట్లేదు. అయినప్పటికీ ఒప్పందం ప్రకారం.. ఆ ప్రభుత్వం ఏడాదికి 450 మిలియన్ డాలర్లను అదానీ గ్రూప్నకు చెల్లిస్తున్నది. అంతేనా అదానీ పవర్ ప్లాంట్ సరఫరా చేయాల్సిన విద్యుత్తు ధర మార్కెట్ రేటు కంటే 35 శాతం ఎక్కువగా ఉన్నది. ఈ క్రమంలోనే డీల్లో సవరణలు కోరుతూ బీపీడీబీ ఆదానీ కంపెనీకి లేఖ రాసింది. గతంలో ఈ డీల్ తమ దౌత్య విజయంగా చెప్పుకొన్న మోదీ సర్కారు.. ఇప్పుడు అదానీ గ్రూప్ మునుగుతుండటంతో డీల్లోకి తమను లాగొద్దని మాట మారుస్తున్నది.
లంకలోనూ ఇలాగే మంట
శ్రీలంకలోని మన్నార్లో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్నకు అప్పగించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చినట్టు గత జూన్లో వెల్లడైంది. శ్రీలంకకు చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు అప్పటి చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండోయే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడం సంచలనం సృష్టించింది.
అదానీకి 27 వేల కోట్లు ఇచ్చాం: ఎస్బీఐ
అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చిన ఒక్కో బ్యాంకులు తాము ఎంతమేర రుణం ఇచ్చినయో వెల్లడిస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదానీ గ్రూపునకు రూ.27 వేల కోట్ల రుణాలు ఇచ్చింది. సంస్థకు ఉన్న మొత్తం రుణాల్లో ఈ వాటా 0.88 శాతమని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తాజాగా వెల్లడించారు. షేర్ల తాకట్టుపై ఎలాంటి రుణాలు ఇవ్వలేదని స్పష్టంచేసిన ఆయన..రేవుల నుంచి గనుల వ్యాపారాలపై మాత్రం రుణాలు ఇచ్చినట్లు చెప్పారు.
పర్యటనల మర్మం ఇదే!
అదానీ గ్రూప్నకు లబ్ధి చేకూర్చడానికే మోదీ కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా పర్యటించినట్టు అర్థమవుతున్నది. 2014 నవంబర్లో మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించిన అనంతరం.. అక్కడి ప్రభుత్వం అదానీ గ్రూప్నకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. 2015 ఏప్రిల్లో ప్రధాని ఫ్రాన్స్ పర్యటన జరగ్గా.. అదానీ గ్రూప్తో రాఫెల్ ఓ ఒప్పందం చేసుకొన్నది. అదే ఏడాది నవంబర్లో మలేషియాలో మో దీ పర్యటించిన అనంతరం.. 2017లో అదానీ గ్రూప్నకు ఆ ప్రభుత్వం ఐలాండ్ పోర్టు కట్టబెట్టింది. 2016 ఫిబ్రవరిలో స్వీడన్, మార్చిలో ఇజ్రాయెల్, జూన్లో అమెరికా, జూలైలో మొజాంబిక్, నవంబర్లో జపాన్లో మోదీ పర్యటించగా.. అదానీ గ్రూప్తో ఆయా ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.