ముంబై, ఫిబ్రవరి 4: బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు తమ పరిధి లోపే అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఎల్ఐసీలు తమ పరిధిలోపే రుణాలు మంజూరు చేశాయని, వాటి విలువ ఆధారంగానే ఇచ్చాయన్నారు. మరోవైపు, అదానీ గ్రూపు రూ.20 వేల కోట్ల ఎఫ్పీవోను రద్దు చేసుకుంటున్నట్లు తీసుకున్న నిర్ణయం దేశీయ ఆర్థికంపై ఎలాంటి ప్రభావం చూపదని ఆమె చెప్పారు. ఈ వ్యవహారంపై నియంత్రణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. గడిచిన రెండు రోజుల్లోనే 8 బిలియన్ డాలర్లమేర ఫారెక్స్ రిజర్వులు పెరిగాయని, ఇది చాలు దేశ ఆర్థిక మూలాలు ఎంత దృఢంగా ఉన్నాయో తెలియడానికి అని మంత్రి చెప్పారు.