ముంబై, నవంబర్ 3: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.7,627 కోట్ల సమీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,574 కోట్ల లాభంతో పోలిస్తే 66.73 శాతం అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1,01,143.26 కోట్లుగా నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.95,373.50 కోట్లుగా ఉన్నది.
‘అధిక వడ్డీ ఆదాయం, ఆస్తుల నాణ్యత ప్రమాణాలు పెరుగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. రుణాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నది. కనీసంగా 10 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతిప్ చౌదరీ అరెస్ట్ చాలా దురదృష్టకరం’
మారుతి డల్.. టాటా ఫుల్
న్యూఢిల్లీ, నవంబర్ 3: ధంతేరాస్ నాడు మారుతి సుజుకీ అమ్మకాలు పడిపోగా, టాటా మోటర్స్ విక్రయాలు పెరిగాయి. ఈసారి దాదాపు 13,000 యూనిట్లు అమ్మినట్లు మారుతి చెప్పగా, 94 శాతం వృద్ధిని నమోదు చేశామని టాటా తెలిపింది. చిప్ కొరతతో ఈ పండుగ సీజన్ ఆనందం ఆవిరైపోయిందని ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఫడా ఆవేదన వ్యక్తం చేసింది. చిప్ల సరఫరా తగ్గినందువల్లే కార్ల తయారీ దిగజారి అమ్మకాలు తగ్గాయని మారుతి చెప్పింది.