ముంబై, ఫిబ్రవరి 5: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మొండి బకాయిలు కోసం నిధులు కేటాయింపులు భారీగా తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.8,432 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్ చరిత్రలో ఇంతటి స్థాయిలో నికర లాభాన్ని ఆర్జించడం ఇదే తొలిసారి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,196 కోట్ల లాభంతో పోలిస్తే 62 శాతం అధికమని పేర్కొంది. ఏడాది క్రితం రూ.75,981 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.78,352 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏకీకృత విషయానికి వస్తే ఎస్బీఐ గ్రూపు నికర లాభం ఏడాది ప్రాతిపదికన 51 శాతం ఎగబాకి రూ.9,692 కోట్లుగా ఉన్నది.
‘వరుస త్రైమాసికాల్లో బ్యాంక్ పనితీరు మెరుగుపడుతున్నది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరుగుతుండటం వల్లనే రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడం జరిగింది. మొండి బకాయిల కోసం నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది’
– దినేశ్ ఖారా,ఎస్బీఐ చైర్మన్