హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా మారిందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగనున్న జాతీయ థాయ్ బాక్సింగ్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్లకు మెండైన ప్రోత్సాహం అందిస్తున్నది. త్వరలోనే అన్ని క్రీడా పరికరాలతో కూడిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నాం. జాతీయ థాయ్ బాక్సింగ్ పోటీలకు రాష్ర్టాన్ని ఎంచుకోవడం సంతోషం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఎమ్మెల్యే గౌతమ్, జగదీశ్వర్ యాదవ్, జాతీయ థాయ్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.