ముంబై : బీజేపీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శనివారం విమర్శలు గుప్పించారు. 2024లో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, దీంతో ప్రస్తుత ఏకపక్ష ప్రభుత్వ పాలనకు తెరపడుతుందన్నారు. పుణేలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ అనీ, అది లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడదన్నారు. కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలున్నాయి. బీజేపీ కూడా భారత రాజకీయాల్లోనే ఉంటుంది కానీ.. ప్రతిపక్ష పార్టీగా అని పేర్కొన్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘బీజేపీ చాలా దశాబ్దాలు అధికారంలో ఉంటుంది’ అని చేసిన వ్యాఖ్యలను ఆయన వద్ద ప్రస్తావించిన సమయంలో ఈ విధంగా స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని బీజేపీ చెప్పుకుంటోందని, ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్షం అవుతుందన్నారు. ‘మహారాష్ట్రలో 105 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం’ అని ఉదహరించారు. యూపీ ఎన్నికలపై స్పందిస్తూ.. ప్రస్తుతం తాము దాద్రానగర్, హవేలీ, గోవాపై దృష్టి కేంద్రీకరించామన్నారు. యూపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.