Chief Secretary | తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును( Sanjay Jaju) నూతన చీఫ్ సెక్రటరీగా(సీఎస్) నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల కిందనే రిలీవ్ చేసింది. ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సంజయ్ జాజును రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.
1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు చెందిన సంజయ్ జాజు 12 ఏండ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. 2014 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఆయన కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 20218-2023 వరకు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. మొన్నటి వరకు నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేసిన విషయం తెలిసందే.