మానకొండూర్/ తిమ్మాపూర్ (మానకొండూర్ రూరల్), మార్చి 5: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 6,7,8 తేదీల్లో కేసీఆర్ మహిళా బంధు సంబురాలను నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్నంటేలా నిర్వహిస్తామని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే కేసీఆర్ మహిళా బంధు సంబురాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8న మానకొండూర్ మండల కేంద్రంలోని సుప్రీం ఫంక్షన్హాల్లో నియోజకవర్గస్థాయి సంబురాలను నిర్వహిస్తుండగా, కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శనివారం సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే తిమ్మాపూర్లోని క్యాంపు కార్యాలయంలో మానకొండూర్ నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆయా తేదీల్లో జరిగే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సుడా చైర్మన్ జీవీఆర్ మాట్లాడుతూ, 8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో జరిగే సంబురాల్లో మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మానకొండూర్, శంకరపట్నం జడ్పీటీసీలు తాళ్లపెల్లి శేఖర్గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, మానకొండూర్ సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఉపసర్పంచ్ నెల్లి మురళి, పాషా ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.