మెదక్, మార్చి 16 : శక్తి స్వరూపిణీ చండీకామాత ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా అలరారుతుందని, దుర్భిక్షం, దుఃఖ అనేవి అక్కడ ఉండవని, చండీమాత సకల దేవతల స్వరూపిణీ, ఆమె అమ్మలగన్న అమ్మ, ఆ చల్లని తల్లిని ప్రసన్నం చేసుకొని అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ తలపెట్టే పవిత్ర కార్యం మహారుద్ర సహిత సహస్ర చండీయాగమని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు లోక కల్యాణార్థ్ధం మహా రుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహించనున్న సందర్భంగా బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ నుంచి 23 వరకు 5 రోజుల పాటు మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తామని తెలిపారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద స్వామి ఆధ్వర్యంలో ఈ యాగం కొనసాగుతుందని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి రైతులు అభివృద్ధి చెంది సంతోషంగా ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెంది బంగారు తెలంగాణ కావాలని ఈ యాగం ద్వారా కోరుకుంటున్నామని తెలిపారు. రెండేండ్ల నుంచి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి చెందాలని, మనుషులు అందరూ సత్ప్రవర్తనతో ఎదగాలని, మాధవానంద సరస్వతీ స్వామి పర్యవేక్షణలో ఈ సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సకల జనులు సంపూర్ణ ఆరోగ్యం, సౌభాగ్యాలు పొందాలని, చండీమాత అమ్మవారి ఆశీస్సులు అందించాలని ఆకాంక్షిస్తూ ఐదు రోజుల పాటు యాగం నిర్వహిస్తామని, ఈ యాగానికి అందరూ వచ్చి ధన్యులు కావాలని కోరారు.
మహారుద్ర సహిత సహస్ర చండీయాగంలో 10 యజ్ఞ కుండల్లో 55 మంది రుత్వికులు పాల్గొని యజ్ఞం చేస్తారని, ఐదు రోజుల్లో ఒక రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 110 సప్తశతి పూజా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 25 మంది రుత్వికులు మంటపాల వద్ద పూజలు నిర్వహిస్తారని చెప్పారు. మొత్తంగా 200 మంది రుత్వికులతో సహస్ర చండీయాగం నిర్వహిస్తామని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తెలిపారు. పది యజ్ఞ కుండల్లో ఒక్కో యజ్ఞ కుండం దగ్గర రుత్వికులు, వేద పండితులు పాల్గొంటారని చెప్పారు.
ఈనెల 19 నుంచి 23 వరకు జరిగే సహస్ర చండీ మహాయాగంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్కుమార్, హవేళీఘనపూర్ ఎంపీ పీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్లు రాజేందర్రెడ్డి, మైపాల్రెడ్డి, శివప్రసాద్, శ్రీను నాయక్, టీఆర్ఎస్ నాయకులు స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.
19న శనివారం ఉదయం 8 గంటల నుంచి గురువందనం, గణపతి పూజ, స్వస్తిహవచనం, యాగశాల ప్రవేశం, దేవతాహ్వానం, రుద్ర, చండీ పారాయణం, అగ్నిప్రతిష్ట, గణపతి, రుద్ర చండీహవనం నిర్వహిస్తారు. 20న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఆవాహిత దేవతాపూజ, రుద్ర, చండీ పారాయణం, హవనం, సూర్య నమస్కారాలు, 21న సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఆవాహిత దేవతాపూజ, రుద్ర, చండీ పారాయణణం, హవనం, మహాలింగార్చన, 22న మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఆవాహిత దేవతాపూజ, రుద్ర, చండీ పారాయణం, హవనం, సామూహిక లక్ష పుష్పార్చన, 23న బుధవారం ఉదయం 8 గంటలకు అవాహిత దేవతాపూజ, రుద్ర, చండీ పారాయణం, హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు ప్రదోషపూజ, మంగళహారతి, రాపజోపచార పూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది.