నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 28: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న విజయ గర్జన సభను విజయవంతం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన విజయగర్జన సన్నాహక సమావేశాల్లో వారు మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ విసృత్త స్థాయి సమావేశంలో విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పా ల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోని మిగ తా రాష్ర్టాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. నవంబర్ 15న వరంగల్లో జరిగే పార్టీ విజయగర్జన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు. జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. విజయగర్జన సభ కు జాతరలా తరలిరావాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి 50 వేల మందిని తరలించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలేదని తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
నల్లగొండ జిల్లా హాలియాలో నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం వంగపల్లిలో నిర్వహించిన సన్నాహక సమావేశం లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. విజయ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. వచ్చేనెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేయాలని, అందుకు ఇప్పటినుంచే కార్యాచరణ, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.