గుడ్గవర్నెన్స్లో దూసుకుపోతున్న తెలంగాణ
‘నమస్తే’లో కథనం నూటికి నూరుపాళ్లు సత్యం
అల్మాస్గూడ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట, డిసెంబర్26: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గణాంకాలతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురించిన కథనాన్ని అల్మాస్గూడ తిరుమల్నగర్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే ఎంతో మేలైన పరిపాలనను అందిస్తున్నారని కేంద్రం జారీ చేసిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, బీజేపీ నాయకులకు ఈ నివేదికలు కనిపించడంలేదా.. అని మంత్రి ఆరోపించారు. నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం కట్టుకథ కాదన్నారు. గణాంకాలతో సహా ఏ రాష్ర్టానికి ఎంత ర్యాంక్ వచ్చిందో వారే నివేదిక జారీ చేశారన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారికి ఇది చెంప పెట్టు లాంటిదన్నారు. ప్రజల మౌలిక సదుపాయాలు, ఎకనామిక్ గవర్నెన్స్, సాంఘిక సంక్షేమంలో ర్యాంకులు చూపించిన తర్వాత కూడా ఇక్కడి నాయకులకు అభివృద్ధి కనిపించడం లేదన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడం మానుకొని వాస్తవాలను గ్రహించాలని ఆమె సూచించారు. అభివృద్ధిని ఆకాంక్షించకుండా అబద్దాలు చెప్పడం మంచిదికాదని మంత్రి పేర్కొన్నారు.