మండలంలోని నాలుగు క్లస్టర్లలో రైతు వేదికలు
మూడు రైతు వేదికలకు రూ.66 లక్షలు మంజూరు
రామాయంపేట రైతు వేదికకు రూ.40 లక్షలు అందజేసిన మంత్రి కేటీఆర్ బంధువులు
నూలి హనుమంతరావు పేరిట సర్వాంగ
సుందరంగా నిర్మించిన అధికారులు
రామాయంపేట, డిసెంబర్ 28 : తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. రామాయంపేట మండలంలోని మొత్తం నాలుగు క్లస్టర్లు ఉన్నా యి. కాట్రియాల, అక్కన్నపేట, రాయిలాపూర్ మూడు క్లస్టర్లకు ప్రభుత్వం ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల చొప్పున నిధులు విడుదల చేసి నిర్మించింది. నాలుగో క్లస్టర్ రామాయంపేటలో నిర్మించే రైతు వేదికకు మంత్రి కేటీఆర్ బంధువులైన దామరచెర్వు గ్రామానికి చెందిన దివంగత నూలి హనుమంతరావు పేరిట వారి కుటుంబ సభ్యులు రూ.40 లక్షలు అందజేశారు. దీంతో రైతు వేదికను సర్వాంగ సుందరంగా అన్ని హంగులతో అధికారులు నిర్మించారు. రామాయంపేట పట్టణంలోని తహసీల్ కార్యాలయం ఎదుట రైతు వేదికను నిర్మించారు. ఈ వేదిక ప్రారంభానికి మంత్రి కేటీఆర్తోపాటు ఆయన సతీమణి శైలిమ, కూతురు, కుమారుడు హాజరుకానున్నట్టు మంత్రి బంధువులు తెలిపారు. గతంలో రైతులు రామాయంపేటకు ఎరువులు, విత్తనాల విక్రయాల కోసం వస్తే ఎండలో నిలబడడమే కాకుండా చలికి వణుకుతూ వర్షాలకు తడిసిపోయేవారు. ఏదేమైనా రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతు వేదికలను నిర్మించడం హర్షణీయమని అన్నదాతలు అంటున్నారు.
రైతు వేదికల నిర్మాణం పూర్తి..
రామాయంపేట మండల వ్యాప్తంగా నాలుగు క్లస్టర్లకు మూడు క్లస్టర్ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. ఒక్క క్లస్టర్ పరిధిలో ఐదు గ్రామాలు ఉంటాయి. ఐదు గ్రామాల రైతులు రైతు వేదికకు వచ్చి వ్యవసాయానికి సంబంధించిన పంటల వివరాలు తెలుసుకోవచ్చు. రైతుల సంక్షేమం కోసం రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. -యాదగిరిరెడ్డి, ఎంపీడీవో, రామాయంపేట
రైతు వేదికలోనే సమావేశాలు..
రామాయంపేట మండలంలో ఉన్న నాలుగు క్లస్టర్లలో రైతు వేదిలను రైతులు వినియోగించుకోవాలి. రైతులకు సంబంధించిన సభలు, సమావేశాలన్నీ రైతు వేదికల్లో నిర్వహిస్తున్నాం. రైతుకు సంబంధించిన ఏ విషయమైనా క్లస్టర్ పరిధిలోని ఏఈవోను సంప్రదించాలి. ఏఈవోలందరూ రైతు వేదికలోనే డ్యూటీలు చేస్తున్నారు.
-వ్యవసాయశాఖ అధికారి రాజ్నారాయణ