అన్నదాతల ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు డబ్బులు
బ్యాంక్ లింకు ఉన్న సెల్ఫోన్లకు మెస్సేజ్లు
వరుసగా ఎనిమిదో పంటకు పెట్టుబడి సాయం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటున్న కర్షకలోకం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల ఆనందం
తొలిరోజు రూ.77.32 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు ఉమ్మడి జిల్లాలోని 2,80,038 మంది రైతుల వ్యక్తి గత బ్యాంక్ ఖాతాలో రూ. 77, 32,37,267 లను వేసింది. సిద్దిపేట జిల్లాలో 89,929 మంది రైతులకుగాను రూ.25,38,11,552, మెదక్ జిల్లాలో 95,162 మంది రైతులకు గాను రూ.24,57,64,559, సంగారెడ్డి జిల్లాలో 94,947 మంది రైతులకుగాను రూ.27,36,61,156ను రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులను వేసింది.
సిద్దిపేట, డిసెంబర్ 28 : రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది.. రైతుబంధు 8వ విడుత డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో మంగళవారం జమ కావడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. యాసంగి వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడుతున్నట్లు సెల్ ఫోన్లకు మెస్సేజ్లు వస్తుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులోకం మురిసిపోతున్నది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, రైతులు క్షీరాభిషేకం చేశారు. పెట్టుబడి సాయం అందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతుబంధు పథకాన్ని నిరాటకంగా అమలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అన్నదాతకు వెన్నంటి సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉన్నారని కొనియాడుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకొనే తత్వం కేసీఆర్దేనని స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లాలో ఏ పల్లెలో చూసినా రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. పంట పండి ఇంటికొచ్చినప్పుడు ఎంత సంబురం ఉంటుందో అదే సంబురం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్కు రైతులమంతా రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం యాసంగి సాగు పెట్టుబడుల కోసం రైతుబంధు డబ్బులను నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో మంగళవారం నుంచి జమ అవుతున్నాయి. వారం రోజుల్లో జిల్లాలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ డబ్బులు జమ అవుతాయి. రైతుల బ్యాంక్ ఖాతాకు లింకు ఉన్న సెల్ఫోన్కు సమాచారం వస్తుంది. దీంతో వారికి వచ్చిన సమాచారం ఆధారంగా రైతులు సంబంధిత బ్యాంకులకు వెళ్లి డబ్బులను తీసుకుంటున్నారు. యాసంగి పంట సాగుకు గాను ఉమ్మడి జిల్లాకు సుమారుగా రూ.920 కోట్లు అవసరం అవసరమవగా, ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేసింది. తొలుత ఎకరాలోపు ఉన్న రైతు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రోజు వారీగా ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతు ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేస్తుంది. పక్కాగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్కార్డు, ఇలా అన్ని వివరాలు ఉన్నవారి డెటాను వ్యసాయశాఖ పోర్టల్లో జిల్లా అధికారులు అప్లోడ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యం పట్టదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు డబ్బులు నేరుగా రైతు ఖాతాలో జమ చేయాలన్నదే లక్ష్యం. ఇందుకోసం కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు పని చేస్తున్నారు. రైతులందరికీ రంగారెడ్డి ట్రెజరీ నుంచి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగానే ఆ రైతు సెల్ఫోన్కు సందేశం వస్తుంది. ఈ డబ్బులను బ్యాంకు, పోస్టాఫీసుల ద్వారా తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రైతు డబ్బులు తీసుకునేటప్పడు పోస్టాఫీసుకు వెళ్తే ఆధార్కార్డు తీసుకొని వెళ్లాలి. వెంటనే పోస్టాఫీసు వాళ్లు ఎలాంటి రుసుము లేకుండా రైతులకు డబ్బులను ఇస్తారు. ఒక రైతు ఖాతా నుంచి గరిష్టంగా పోస్టాఫీసులో రోజుకు రూ.10 వేల వరకు మాత్రమే ఇస్తారు. బ్యాంకులో అయితే మొత్తం డబ్బులను తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
రైతుల ఖాతాలో రైతుబంధు జమ అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల వ్యక్తిగత ఖాతాలో మంగళవారం నుంచి జమ చేస్తుంది. జిల్లాలో పట్టాదారు పుస్తకం ఉండి అర్హులైన రైతులందరి వివరాలను వ్యవసాయశాఖ పోర్టల్లో అప్లోడ్ చేశాం. వారం రోజుల్లో అందరి ఖాతాలో రైతుబంధు జమ అవుతుంది. రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో పడగానే బ్యాంక్ లింక్ ఉన్న సెల్ఫోన్కు ఎంత డబ్బులు పడ్డాయి అనే సమాచారం వస్తుంది. – శ్రవణ్కుమార్ (సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి)
అప్పులు లేకుండా సాగు చేస్తున్నాం..
సీఎం కేసీఆర్ రైతులకు దేవుడు. పంటలు పండించేందుకు గతంలో అప్పులు చేసి ఎరువులు, విత్తనాలు, కలుపు తీసే వారం. టీఆర్ఎస్ ప్రభుత్వం పంటలు పండించేందుకు ఎకరాకు రూ.5 వేలు బ్యాంకులో జమ చేయడంతో ఇప్పుడు ఆ సమస్య లేదు. బ్యాంకులో డబ్బులు పడగానే వెళ్లి తీసుకుంటున్నాం. తెలంగాణ సర్కార్కు ఎప్పుడు రుణపడి ఉంటాం. – ఎన్జీ.నర్సిములు రైతు
రైతుబంధుతో పైసల రంది పోయింది..
సీఎం కేసీఆర్ పంటలు పండియ్యనీకి కాలువలు తీసి నీళ్లు పంపుతున్నడు. పెట్టుబడికి బ్యాంకుల పైసలు వేస్తున్నరు. మా రైతులకు ఏమన్న మంచిరోజులేపో… అందరం నిమ్మలంగా ఎవుసం చేస్తున్నం. రైతులమంతా మంచిగ బతుకుతున్నం. అప్పులు చేయకుండనే ఎవుసం చేస్తున్నం. బతికున్నంత కాలం కేసీఆరే సీఎం కావాలి. – బాలమల్లయ్య, పిడిచెడ్
పెట్టుబడులు కేసీఆర్ ఇత్తండు..
రైతుకు కేసీఆర్ మేలు చేత్తండు… అన్నిపనులు చేత్తండు. రైతుకు గిట్ల మంచిపనులు కేసీఆర్ లాగ చేసేటోల్లు లేరు. ఎవుసానికి పెట్టుబడులు చెప్పినట్లే ఇత్తండు. నిజంగా ముఖ్యమంత్రి సార్మేలును రైతులు మరవరు. – గొర్ల అయిలయ్య, రైతు హుస్నాబాద్ టౌన్
బ్యాంకు ఖాతాలో పడ్డయ్..
నాకున్న ఎకరం పొలానికి సంబంధించి రైతు బంధు రూ.5వేలు ఖాతాలో వచ్చినయ్. కేసీఆర్ సార్ను నా జీవితంలో మరువను. ఆయన సంతోషంగా ఉండాలి. సార్ మాటమీద నిలబడే వ్యక్తి. రైతుబంధు ఈయాళ వేస్తనన్నడు.. వేసిండు. ఆ పైసలను పొలం పనులకు ఖర్చు చేసుకుంటం. -బండారి మల్లారెడ్డి ఆర్.వెంకటాపూర్, రామాయంపేట
రైతులకు దేవుడు సీఎం కేసీఆర్
పేద రైతులకు సీఎం కేసీఆర్ దేవుడు. రెండు పంటల సాగుకూ ఎకరాకు రూ.పది వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. నాకు ఎకరం పొలం ఉంది. నిన్ననే నా బ్యాంకు ఖాతాలో రైతుబంధు డబ్బులు రూ.5 వేలు జమ చేశారు. ఎవరి వద్ద అప్పులు చేయకుండా సాగు చేసుకుంటున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రాంశెట్టి, రైతు లచ్చినాయక్తండా
ఇతర పంటలకు ఖర్చు చేస్తాం..
యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు డబ్బులను ఇతర పంటలకు పెట్టుబడి పెడుతాం. గతంలో ట్రాక్టర్కు, ఎరువులు, విత్తనాలకు ఉపయోగించాను. ఇప్పుడు వరికి బదులు ఇతర పంటలు వేయాలని ప్రభుత్వం చెప్పడంతో ఇతర పంటలను వేసుకున్నాం. పెట్టుబడికి రైతుబంధు ఎంతో ఉపయోగపడుతుంది. – రాధాకిషన్, రైతు రేగోడ్
యాసంగి పెట్టుబడికి అందినై..
సీఎం కేసీఆర్ సార్ మాటమీద ఉన్న వ్యక్తి. రైతులు జీవితంలో మరచిపోకుండా రైతుబంధు డబ్బులు వేసిండు. నాకున్న 35 గుంటల పొలంలో ఉల్లినారు, కూరగాయలు వేసుకున్న. ఇప్పుడు నాకు పంటకు పెట్టుబడికి అందినయి. ఇంతకంటే నాకేం కావాలె. కేసీఆర్ సార్ రైతులను అప్పులు లేకుండా చేస్తుండు. మాకు దేవుడంటే ఎక్కడో ఉన్నాడనుకున్న దేవుడు కళ్లముందే ఉన్న కేసీఆర్. – రాచపల్లి ఎల్లం, రైతు, రామాయంపేట
కర్షక రక్షకుడికి క్షీరాభిషేకం
సిర్గాపూర్, డిసెంబర్ 28: రైతుల సంక్షేమాభివృద్ధికి సీఎం కేసీఆర్ విశిష్ట కృషి చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం కింద నగదు రైతుల ఖాతాల్లో జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక ఎంపీపీ కార్యాలయం ఎదుట ఎంపీపీ జార మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జడ్పీటీసీ మల్లగారి రాఘవరెడ్డి, రైతులు కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతకు వెన్నంటి సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉన్నారని కొనియాడారు. కార్యక్రమమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గుర్రపు కృష్ణమూర్తి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంజీవరావుపాటిల్, సర్పంచ్ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు నర్సాగౌడ్, రమేశ్, మాధవరావు, కృష్ణాగౌడ్, శ్రీనివాస్రావుపాటిల్, రైతులు ఉన్నారు.