కీవ్, మార్చి 17: ఉక్రెయిన్పై సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రష్యా సేనలు తమ మారణహోమాన్ని కొనసాగిస్తున్నాయి. బుధవారం సాయంత్రం మరియుపోల్లోని ఓ మూడంతస్థుల థియేటర్పై క్షిపణులతో విరుచుకుపడ్డ పుతిన్ సేనలు గురువారం కూడా జనావాసాలపై బాంబుల వర్షం కురిపించాయి. నగరంలోని ఓ మునిసిపల్ స్విమ్మింగ్పూల్ కాంప్లెక్స్పై రష్యా బాంబుల మోత మోగించింది. దీంతో భవన సముదాయం కుప్పకూలింది. దాడి సమయంలో కాంప్లెక్స్లో గర్భిణులు, చిన్నారులు కూడా ఉన్నారు. కీవ్లోని నివాస సముదాయాలు, మెరెఫాలోని ఓ పాఠశాల, కమ్యూనిటీ సెంటర్పై పుతిన్ సేనలు దాడులకు తెగబడ్డాయని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 21 మంది మరణించారు. పుతిన్ సేనలను అడ్డుకొనేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం జర్మనీని కోరారు. మరియుపోల్ థియేటర్ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదు. మరోవైపు, ఉక్రెయిన్కు స్విచ్ బ్లేడ్ ఆత్మాహుతి డ్రోన్లను అందజేస్తామని అమెరికా ప్రకటించింది.
ఉక్రెయిన్పై రష్యా దాడి గురించి ఈ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడుతారని వైట్హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యాకు వ్యతిరేకంగా తమతో కలిసి పనిచేయడానికి భారత్ను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. ఉక్రెయిన్పై ఏకపక్షంగా దాడులకు తెగబడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను యుద్ధ నేరస్థుడిగా బైడెన్ పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వచ్చే ఏడాది ప్రపంచ దేశాలు ఆర్థికంగా పెను సవాళ్లు ఎదుర్కోవచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) హెచ్చరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరిట అస్సాంకు చెందిన స్టార్టప్ టీ కంపెనీ ‘అరోమికా’ ఓ టీ పొడిని తీసుకొచ్చింది. ‘జెలెన్స్కీ-ఏ స్ట్రాంగ్ అస్సాం సీటీసీ టీ’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది.