సూర్యాపేట, మార్చి 21 : అభివృద్ధి విషయంలో పట్టణాలతో పోటీ పడుతున్న పల్లెలు ఆర్ధిక క్రమశిక్షణలోనూ ముందంజలో నిలుస్తున్నాయి. పన్నుల చెల్లింపుల లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గ్రామపంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా ప్రభుత్వం అందించే ఆర్థిక వనరులతోపాటు స్వతహాగా పన్నుల రూపంలో సమకూర్చుకుంటేనే ప్రజలకు మెరుగైన వసతులు కల్పించగలుగుతాయనేది వాస్తవం. 2021-22 ఆర్థిక సంవత్సరం పన్నులు చూస్తే.. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 475 గ్రామపంచాయతీల్లో 92 శాతం వసూలు కాగా, 5 మున్సిపాల్టీల్లో 74 శాతం మాత్రమే వసూలయ్యింది. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో లక్ష్యం చేరుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సూర్యాపేట, మార్చి 21 : రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం పాలనా సౌలభ్యం, అభివృద్ధ్ది కోసం కొత్తగా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పంచాయతీ రాజ్ చట్టం 2018 ద్వారా సూర్యాపేట జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉండగా మరో రెండు కొత్తవి, 323 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా 152 ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధ్ది వేగం పెంచడానికి ప్రత్యేకంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. ప్రభుత్వ నిధులతో పాటు గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీల్లో వసూలు చేసే ఇంటి పన్ను, లైసెన్స్ ఫీజులు, నీటి పన్నులను గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీలోనే ఖర్చు చేయడం జరుగుతుంది. అయితే పన్నుల వసూలులో జిల్లాలో గ్రామ పంచాయతీలు ముందు వరుసలో ఉండగా మున్సిపాల్టీలు కొంత వెనుకబడి ఉన్నాయి. మార్చి 21 నాటికి జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీల్లో 92 శాతం పన్నులను వసూలు చేయగా మున్సిపాల్టీల్లో సుమారు 74 శాతం వసూలయ్యాయి.
సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో 475 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఏటా పన్నుల రూపంలో రూ. 10,18,56,598 వసూలు చేయడానికి అవకాశం ఉంది. గతంలో ఉన్న బకాయిలు రూ. 45,56,646 ఉన్నాయి. ఈ రెండు కలిపి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 10,64,13,244 నగదును వసూలు చేయాల్సి ఉంది. మార్చి 15 వరకు రూ 9,51,74,848 వసూలు చేయడం జరిగింది. ఇందులో పాత బకాయిలు రూ. 32,87,342 ఉండగా ఈ ఏడాది రావల్సిన పన్నులు 9,18,84,,506 వసూలు చేశారు. దాదాపు 92 శాతం పన్నులను వసూలు చేయడం జరిగింది. కేవలం 1.12 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల చివరి నాటికి మరో 5 నుంచి 8 శాతం వసూలు చేయనున్నారు. జిల్లాలోని కేవలం ఏడు మండలాలలోనే 80 శాతం నుంచి 90 శాతం మధ్యలో పనులు వసూలు చేయగా మిగిలిన 15 మండలాలు 90 శాతం పైగా ఇంటి పన్నులను వసూలు చేశారు. అత్యధికంగా చివ్వెంల 96.08, హుజూర్నగర్ 96.93 శాతం పన్నుల ను వసూలు చేశారు. అతి తక్కువగా మేళ్లచెర్వు 81.50 శాతం మాత్రమే పన్ను వసూలైంది.
జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల పరిధిలో పన్నుల వసూలు కొంత మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు సుమారు 74 శాతం మాత్రమే పన్నులను వసూలు చేశారు. అత్యధికంగా కోదాడ మున్సిపాల్టీలో 80 శాతం వసూలు కాగా హుజూర్నగర్లో 64 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 5 మున్సిపాల్టీల పరిధిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 20.37 కోట్ల పన్ను వసూలు కావల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.14.48 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా సుమారు 5.89 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పనుల వసూలుకు రెడ్ నోటీస్ ఇచ్చి ఇంటి నల్లా కలెక్షన్ సైతం సీజ్ చేస్తున్నారు. మార్చి 31 వరకు టార్గెట్ పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మున్సిపల్ కమిషనర్లకు, జిల్లా పంచాయతీ అధికారికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ పను వసూలులో జిల్లాను నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో వంద శాతం ట్యాక్స్ కలెక్షన్ అయ్యేలా చూస్తాము. గ్రామంలో, పట్టణంలో ప్రభుత్వ అనేక సంక్షేమ అభివృద్ధ్ది కార్యక్రమాలు చేస్తున్నది. మన పరిసరాలు అభివృద్ధి జరగాలంటే మనం కూడా ఇంటి పన్నులు చెల్లించాలి. అందుకు ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నాం. దాని ఫలితమే గ్రామ పంచాయతీల్లో 92 శాతం ట్యాక్సీ కలెక్షన్. మున్సిపాల్టీల్లో సైతం వేగం పెంచాం. అక్కడ సైతం టార్గెట్ చేరుకుంటాం.
– హేమంత్ కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్, సూర్యాపేట