చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- వ్యాన్ ఢీకొని నలుగురు దుర్మరణం చెందగా.. 60 మందికి గాయాలయ్యాయి.
దిండిగల్ జిల్లా వతలకుండు సమీపంలో బట్లగుండు-దిండిగల్ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
థేని నుంచి దిండిగల్కు ప్రయాణికులతో వెళ్తున్న టీఎన్ఆర్టీసీ బస్సు, సింగరకోట్టైకి కూలీలతో వెళ్తున్న వ్యాన్ వతలకుండు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్తోసహా నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.
వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన మధురైలోని రాజాజీ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 15 మంది ప్రయాణిస్తున్నారు.
బస్సులోని ప్రయాణికుల్లో 54 మందికి స్వల్పగాయాలు కాగా క్షతగాత్రులను బట్లగుండు జనరల్ హాస్పటల్కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.