సంగారెడ్డి : హోలీ పండుగ రోజు నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ దొడ్ల నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పండుగ పూట స్నేహితులతో కలిసి హోలీ ఆడి స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు.
గ్రామానికి చెందిన విఠల్, పద్మ దంపతుల రెండో కుమారుడు గైని నివర్తి(12) మధ్యాహ్నం వరకు రంగులు చల్లుకుని మరో బాలుడు ఆకాశ్తో కలిసి స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లాడు.
ఇద్దరు కలిసి చెరువులో దిగగా లోతైన ప్రదేశానికి వెళ్లడంతో ఇద్దరు బాలురు మునిగిపోతుండడాన్ని గమనించిన కొందరు వారిని రక్షించే ప్రయత్నం చేయగా.. ఆకాశ్ ప్రాణాలతో బయటపడగా నివర్తి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు.