కుల వివక్షతో అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఎనిమిదేండ్ల కిందట అప్పటి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కుల ఆధిపత్యానికి దళిత విద్యార్థి బలయ్యాడని గొంతెత్తారు. ఈ ఘటనతో కదిలిపోయిన రాహుల్ ఏకంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తాజా మ్యానిఫెస్టోలో ‘రోహిత్ వేముల యాక్ట్’ను చేర్చారు. విద్యాసంస్థల్లో కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం రోహిత్ వేముల అసలు దళితుడే కాదని కోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఫలితంగా హైకోర్టు ఆ కేసును మూసివేస్తూ నిందితులుగా పేర్కొన్నవారందరికి క్లీన్చిట్ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత దళితుల పక్షాన నిలబడితే, రేవంత్రెడ్డి సర్కారు మాత్రం దళితులుగా కూడా గుర్తించడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం హెచ్సీయూలో భారీ ప్రదర్శనకు దిగారు.
Rohith Vemula | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు దర్యాప్తును ముగిస్తున్నట్టు తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. రోహిత్ వేముల దళితుడు కాదు అని పేర్కొంటూ పోలీసులు హైకోర్టుకు తమ దర్యాప్తు నివేదికను సమర్పించారు. తన అసలు కులం బయటపడుతుందన్న భయంతోనే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నాటి సికింద్రాబాద్ ఎంపీ, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, నాటి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్రావు, హైదరాబాద్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ అప్పారావు, నాటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు ఏబీవీపీ నాయకులకు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. వేముల కుటుంబసభ్యుల కులం సర్టిఫికెట్లు అన్నీ నకిలీవని, ఎటువంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును మూసివేస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై కింది కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు వేముల కుటుంబానికి సూచించింది.
పోలీసుల నివేదిక అత్యంత దారుణం అని రోహిత్ వేముల సోదరుడు రాజా వేముల పేర్కొన్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియడం లేదని వాపోయారు. రోహిత్ వేముల 2016 జనవరి 17న హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక ఆందోళనలకు తెరతీసింది. యూనివర్సిటీల్లో దళితులపై కొనసాగుతున్న వివక్షను నిరిసిస్తూ దేశంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు.
పోలీసుల నివేదికపై శనివారం హైదరాబాద్ వెళ్లి సీఎం రేవంత్రెడ్డిని కలుస్తామని రాజా వేముల చెప్పారు. పోలీసులు 2017 తరువాత కేసు దర్యాప్తును నిలిపివేశారని అన్నారు. తమ కుటుంబపు కుల ధ్రువీకరణపై 15 మంది సాక్షుల నుంచి సేకరించిన వాంగ్మూలాలను జిల్లా కలెక్టర్కు ఇచ్చారని తెలిపారు. ఆ వాంగ్మూలాల గురించి పోలీసులు తమ నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదని, అలా ఎందుకు జరిగిందో పోలీసులే చెప్పాలని అన్నారు.
చట్టం ప్రకారం ఒకరి కులాన్ని ధ్రువీకరించాల్సింది జిల్లా కలెక్టర్ తప్ప, పోలీసులు కాదు. కులాన్ని ధ్రువీకరించేందుకు జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ (డీఎల్ఎస్సీ) సాక్ష్యాధారాలను సేకరించి కలెక్టర్కు అందజేస్తుంది. దాని ఆధారంగా కలెక్టర్ తన నిర్ణయాన్ని వెలువరిస్తారు. రోహిత్ కులానికి సంబంధించి 15 మంది సాక్షుల నుంచి సేకరించిన వాంగ్మూలాలపై జిల్లా కలెక్టర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టులో వేముల కుటుంబం పక్షాన వాదనలు వినిపించిన న్యాయవాది ఏ సత్యప్రసాద్ చెప్పారు. కలెక్టర్ తన నిర్ణయాన్ని వెల్లడించకముందే వేముల దళితుడు కాదని పోలీసులు నిర్ధారించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇంత హడావుడిగా నివేదికను సమర్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయమూర్తి కూడా వ్యాఖ్యానించారని సత్యప్రసాద్ తెలిపారు. పోలీసుల నివేదిక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని అన్నారు. బీజేపీ నేతలు, వైస్ చాన్న్సలర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్న అంశంపై దర్యాప్తు చేయడానికి బదులుగా మృతుడి కులం ఏమిటో తెలుసుకోవడంపై దృష్టి సారించారని చెప్పారు. ఈ కేసులో నిందితులందరూ బీజేపీ నాయకులని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం దురదృష్టకరమని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.
తప్పుడు నివేదికను రూపొందించిన పోలీసులపై ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలని మరో న్యాయవాది జైభీమారావు పేర్కొన్నారు. షెడ్యూల్డు కులాలలోని మాల కులానికి చెందిన వ్యక్తినని రోహిత్ తల్లి రాధిక వేముల మొదటి నుంచి చెప్తూనే ఉన్నారని అన్నారు. ఆమె తన బాల్యం నుంచి ఓబీసీలుగా ఉన్న వడ్డెర కులానికి చెందిన వారింట్లో పెరిగారని తెలిపారు. చట్టాన్ని పరిగణించకుండా.. కేవలం కొన్ని ప్రాథమిక నివేదికల ఆధారంగా అధికారులు ఒక అంచనాకు వచ్చారని విమర్శించారు. ఇందుకు దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రోహిత్ ఆత్మహత్య అనంతరం సాగిన ‘జస్టిస్ ఫర్ వేముల’ ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చింది. రెండేండ్ల క్రితం 2022, నవంబర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రోహిత్ తల్లి రాధికను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో ‘రోహిత్ వేముల చట్టం’ తెస్తామని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారి విద్యా హక్కును పరిరక్షించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తెస్తామని ఆ పార్టీ పేర్కొంది. తీరా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కేసును నీరుగార్చే విధంగా నివేదికను ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ నివేదిక తెలంగాణ పోలీసులకు, ఆరెస్సెస్, ఏబీవీపీకి మధ్యనున్న సంబంధాలను స్పష్టం చేస్తున్నదని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఇనియావన్ భానుమతి ఆరోపించారు. ఆరెస్సెస్ 2015 నుంచి వినిపిస్తున్న కథనానికి పోలీసుల నివేదిక ప్రతిరూపంగా ఉన్నదని అన్నారు.
రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై మళ్లీ దర్యాప్తు జరుపుతామని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు నివేదికను గత ఏడాది చివరలో రూపొందించారని, దాని ఆధారంగానే దర్యాప్తు అధికారి గత నెల 21న కోర్టుకు తుది నివేదికను సమర్పించారని తెలిపారు. అయితే విచారణ జరిగిన తీరుపై రోహిత తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున మరోసారి విచారణ జరుపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ నుంచి అనుమతి కోరుతామని వెల్లడించారు.
కొండాపూర్, మే 3 : రోహిత్ వేముల ఆత్మహత్యపై పోలీసుల నివేదికను వ్యతిరేకిస్తూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వర్సిటీలోని వెలివాడ నుంచి ప్రధాన గేట్ వరకు వివిధ సంఘాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన గేట్ ముందు ధర్నాకు దిగారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. రోహిత్ కుల వివక్ష కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని 16 మంది సాక్ష్యం చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. రోహిత్ వేములకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.
రోహిత్ వేముల కేసును కాంగ్రెస్ సర్కార్ మొత్తానికి ఆగం పట్టించిందని విద్యార్థిలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బీజేపీకి అనుకూలంగా వారు చెప్పినట్టే కేసును మూసివేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రోహిత్ కుటుంబానికి అండగా నిలుస్తామని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్గాంధీ స్వయంగా చెప్పాడని, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వమే వారికి అన్యాయం చేస్తున్నదని మండిపడుతున్నాయి. దళిత, వెనుకబడిన తరగతుల వారు వివక్షకు గురికాకుండా ‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకొస్తామని ఇటీవల తమ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ నేతలకు అండగా నిలుస్తున్నదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.