న్యూఢిల్లీ : ఆర్ధిక సంక్షోభం ముంచుకొస్తుందనే భయంతో పలు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో తాజాగా రాబిన్హుడ్ కంపెనీ ఉద్యోగుల మాస్ లేఆఫ్స్కు సంసిద్ధమైంది. తమ సిబ్బందిలో 23 శాతం మందిని తొలగిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్లో రాబిన్హుడ్ తన ఉద్యోగుల్లో 9 శాతం మందిపై వేటు వేసింది.
రికార్డుస్ధాయిలో ద్రవ్యోల్బణంతో పాటు క్రిప్టో మార్కెట్ కుంగుబాటుతో ఉద్యోగులను తొలగించకతప్పడం లేదని కంపెనీ సీఈఓ వ్లాద్ టెనెవ్ చెప్పుకొచ్చారు. కంపెనీ ఆపరేషన్స్, మార్కెటింగ్, ప్రోగ్రాం మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నామని తెలిపారు. రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్స్, క్రిప్టో ఆస్తుల్లో ట్రేడింగ్ కొనసాగిస్తారనే అంచనాతో 2021లో రికార్డు స్ధాయిలో నియామకాలు చేపట్టామని రాబిన్హుడ్ సీఈఓ వివరించారు.
సిబ్బందిపై వేటు తప్పదని కంపెనీ ఇప్పటికే ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది. వేటు పడిన ఉద్యోగులు అక్టోబర్ 1 వరకూ కంపెనీలో కొనసాగవచ్చని సంకేతాలు పంపారు. ఇక సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా పలువురు ఉద్యోగులను సాగనంపనుంది. కొందరు ఉద్యోగుల సామర్ధ్యం, పనితీరుపై సీఈఓ సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు నైపుణ్యాలను, పనితీరును మెరుగుపరుచుకోవాలని ఉద్యోగులను ఆయన ఇటీవల హెచ్చరించారు. గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై కసరత్తు సాగిస్తున్నాయి.