17,568 కోట్లతో రోడ్ల అభివృద్ధి
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్లలో జరిగిన అభివృద్ధి కంటే తెలంగాణలో ఏడేండ్లలో రెట్టింపు అభివృద్ధి జరిగిందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం రహదారులు, భవనాలు హౌసింగ్, లెజిస్లేచర్ పద్దులపై అసెంబ్లీలో సభ్యుల సందేహాలకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని దాదాపు 15 సార్లు కలిసి మాట్లాడారని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలో 2,511 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా ఇప్పుడు 4,983 కిలోమీటర్లకు పెరిగాయని వెల్లడించారు. ఏడేండ్లలో రోడ్ల అభివృద్ధికి రూ.17,568 కోట్లు ఖర్చు చేసి, బిల్లులు కూడా చెల్లించామని వివరించారు. అక్కన్నపేట-మెదక్, కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్లు చేపట్టాలని కేంద్రాన్ని కోరితే వీలుకాదని చెప్పిందని, సీఎం కేసీఆరే ఈ లైన్ల కోసం రూ.1,181 కోట్లు ఇచ్చి పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఏడున్నరేండ్లలో 80 లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించామని మంత్రి తెలిపారు. . అమరవీరుల స్మృతివనం నిర్మాణం నాలుగైదు నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు. రోడ్లు భవనాల శాఖకు రూ.7,810 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించామని పేర్కొన్నారు.
డబుల్ ఇండ్లకు నిధులివ్వని కేంద్రం
గ్రామీణ ప్రాంతాల్లో 7,866 డబుల్ బెడ్రూం ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లో 1,57,669 ఇండ్లు నిర్మించామని మంత్రి వేముల చెప్పారు. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.10,773 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రూ.2,875 కోట్లు రావాల్సి ఉండగా, రూ.1,311 కోట్లే ఇచ్చిందని తెలిపారు. కొల్లూరులో త్వరలో 12 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు.