గూడూరు, జనవరి 26 : ప్రభుత్వం తలపెట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన సుభద్ర అనే మహిళ చేయూతనందించారు. తన భర్త జయంతితోపాటు రిపబ్లిక్ డేను పురస్కరించుకొని బుధవారం రూ.1.10 లక్షల విలువైన సామగ్రిని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు అందజేసి ఉదారతను చాటుకొన్నారు. ఆమె భర్త మామిడి పరమాత్మ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కంపౌండర్గా పనిచేశారు. రిటైర్ అయిన ఏడాదికి మరణించారు. ఆయన జ్ఞాపకార్థం పాఠశాలకు బెంచీలు, టేబుళ్లను అందజేసినట్టు సుభద్ర తెలిపారు. గతంలో ఈ పాఠశాలలో చదువుకొన్న తన పిల్లలు ఉన్నతంగా ఎదిగారని, పాఠశాలకు ఏదైనా సహాయం చేయాలని ముందుకు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుభద్రను సర్పంచ్ నూనావత్ రమేశ్, జడ్పీటీసీ గుగులోత్ సుచిత్ర, ప్రధానోపాధ్యాయుడు కాంతారావు తదితరులు సన్మానించారు.