ముంబై: బ్యాంకు వడ్డీలు ఇప్పుడు మరింత భారం కానున్నాయి. రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచేందుకు ద్రవ్యపరపతి సంఘం ఏకగ్రీవంగా అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. 50 బీపీఎస్ పెంపుతో రెపో రేటు 4.90 శాతానికి చేరుకున్నది. రెపో రేటును పెంచడం వల్ల వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. దీంతో కార్లు, పర్సనల్, హోం లోన్స్పై వడ్డీ కూడా పెరగనున్నది. దీని వల్ల ఈఎంఐలు కూడా పెరుగుతాయి. అయితే పెంచిన వడ్డీ రేట్లను తక్షణం అమలు చేయనున్నట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈసారి సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని, క్రూడాయిల్ ధరలు కూడా ప్రస్తుతానికి అదుపులో ఉన్నందున 2022-23 సంవత్సరానికి ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థ మరింత దూకుడుగా మారాలని, దీని కోసం యూపీఐ ఫ్లాట్ఫామ్తో క్రెడిట్ కార్డులను జోడించే ప్రతిపాదన ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.