హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది నుంచి రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఇటీవల దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబందు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
పథకంలో భాగంగా రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్ షిప్లు, ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బార్, వైన్షాప్లు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా దళితబంధు ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. ధరణి పోర్టల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.