న్యూఢిల్లీ, మే 13: ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ 2000 భారీ సంస్థల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా చూసినైట్టెతే 53వ స్థానంలో ఉన్నది. గతంతో పోల్చితే ఈసారి జాబితాలో రెండు స్థానాలు ఎగబాకింది. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువల ఆధారంగా ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ ఈ ర్యాంకులను ప్రకటించింది.
కాగా, టాప్-10 భారతీయ సంస్థల్లో రిలయన్స్ తర్వాత ఎస్బీఐ రెండో స్థానంలో నిలిచింది. భారత్ నుంచి ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన సంస్థలే ఫోర్బ్స్ జాబితాలో ఎక్కువ ర్యాంక్ను పొందడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం (2021-22) రిలయన్స్ అమ్మకాలు 104.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వార్షిక ఆదాయం 100 బిలియన్ డాలర్లకుపైగా నమోదవడం ఓ భారతీయ సంస్థకు ఇదే తొలిసారి. చమురు నుంచి టెలికందాకా రకరకాల వ్యాపారాలు చేస్తున్న ఈ సంస్థ నికర విలువను ఈ ఏడాది ఆరంభంలో 90.7 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక ఎస్బీఐ మార్కెట్ విలువ 56.12 బిలియన్ డాలర్లుగా ఉన్నది. దేశవ్యాప్తంగా బ్యాంక్కు 24వేల శాఖలు, 62,617 ఏటీఎంలున్నాయి. ఇదిలావుంటే వేదాంత లిమిటెడ్ ఈసారి ఏకంగా 703 స్థానాలు ఎగిసి 593వ ర్యాంక్కు చేరడం గమనార్హం.
ఈసారి జాబితాలోకి అదానీ గ్రూప్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ (1,453), అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ (1,568), అదానీ గ్రీన్ ఎనర్జీ (1,570), అదానీ ట్రాన్స్మిషన్ (1,705), అదానీ టోటల్ గ్యాస్ (1,746) సంస్థలు కొత్తగా వచ్చాయి. ఈ ఏడాది అదానీ గ్రూప్ సంపద జోరు మీదుండగా, ముకేశ్ అంబానీని దాటేసి భారత్లోనేగాక, ఆసియా దేశాల్లోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారెన్ బఫెట్ను కూడా అధిగమించి ప్రపంచంలోనే ఐదో సంపన్నుడిగా నిలిచారు. విద్యుదుత్పత్తి, వంటనూనెలు, పోర్టులు, బొగ్గు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అదానీ సంస్థలున్నాయి. 2008లో ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో తొలిసారిగా గౌతమ్ అదానీ పేరెక్కింది. నాడు అదానీ సంపద 9.3 బిలియన్ డాలర్లు.