యాదాద్రి భువనగిరి, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/యాదాద్రి :యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా దేవాలయ సప్త గోపురాలకు సంప్రోక్షణ పర్వం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘల్ నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో ప్రధానాలయ దివ్యవిమాన గోపురంపై ఏర్పాటు చేసిన సుదర్శన స్వర్ణ చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. తూర్పు పంచతల రాజగోపుర కలశాలలకు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పశ్చిమ సప్తతల రాజగోపుర కలశాలలకు విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, దక్షిణ పంచతల రాజగోపుర కలశాలలకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఉత్తర రాజగోపుర కలశాలలకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, తూర్పు రాజగోపుర కలశాలలకు పౌరసరఫరాల శాఖ గంగుల కమలాకర్, పశ్చిమ రాజగోపురం కలశాలలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం పుణ్య జలాలతో సంప్రోక్షణ చేశారు. గరుడ అళ్వార్ సన్నిధి వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆంజనేయస్వామి సన్నిధివద్ద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఆగ్నేయ ప్రాకార మండపం-3 వద్ద విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, వాయువ్య మండపం-18 వద్ద మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఈశాన్య మండపం-21 వద్ద మంత్రి మల్లారెడ్డి, ఈశాన్య మండపం-23 వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఈశాన్య ప్రాకార మండపం-24 వద్ద మంత్రి హరీశ్రావు, శ్రీరామానుజ సన్నిధివద్ద సీఎస్ సోమేశ్కుమార్, అష్టభుజి మండపాల్లో రెండవ ఆగ్నేయ ప్రాకార మండపం వద్ద రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, ఒకటో ప్రాకార మండపం వద్ద ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, 5వ మండపంవద్ద ప్రభుత్వ విప్ ఎంఎస్.ప్రభాకర్, లోపలి ప్రాకార మండపం (యాలీపిల్లర్) ఆగ్నేయంవద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆండాలమ్మవారి సన్నిధిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం వద్ద ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నైరుతి మండపం వద్ద ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, నాల్గో ప్రాకార మండపంవద్ద ప్రభుత్వ విప్ బాల్క సుమన్, వాయువ్య మండపం వద్ద ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, 20వ ఈశాన్య మండపం వద్ద ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్కుమార్, 19వ వాయువ్య మండపం వద్ద రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, 6వ ఆగ్నేయ మండపం వద్ద యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన నేపథ్యంలో రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరు కావడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో 2500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. పట్టణ పరిసరాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్స్వాడ్ బృందాలు అడుగడుగునా తనిఖీలు చేపట్టాయి. పట్టణంలో పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. వీవీఐపీ, వీఐపీల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. 10 మంది డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 96 మంది సీఐలు, 198 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు 180, 1271 మంది హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హాంగార్డులు, 600 మంది ఏఆర్ సిబ్బందితో పాటు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఇంటిలిజెన్స్, షీ టీం, ఎస్బీ, ట్రాఫిక్, ఎస్ఓటీ బృందాలు బందోబస్తులో పాల్గొన్నాయి. పోలీసు సిబ్బందికి ఫస్ట్ చాయిస్ రెడీమిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో మంచినీటి, బటర్మిల్క్ ప్యాకెట్లను అందించారు.
సంప్రోక్షణ పర్వానికి ముందే వసతుల కల్పనపై దృష్టిసారించిన అధికారులు ఆ సమయానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. పది రోజుల క్రితమే గండి చెరువులోకి గోదావరి జలాలు చేరాయి. స్వామి కైంకర్యాల కోసం నిర్మించిన విష్ణు పుష్కరిణి, భక్తుల అవసరాలకోసం నిర్మించిన కల్యాణ కట్ట, లక్ష్మీపుష్కరిణిని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ సైతం యాదాద్రి దర్శిని పేరుతో కొండపైకి భక్తుల సౌకర్యార్థం బస్సులను నడుపుతున్నది. దివీస్ కంపెనీ ఆధ్వర్యంలో క్షేత్రం నలుమూలలా రూ. 2.50 కోట్లతో ‘యాదాద్రి జలప్రసాదం’ పేరుతో 15 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుండగా సోమవారం నాటికి 8 ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో భక్తుల దాహార్తి తీరింది.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునః ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల అసౌకర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి కొండకింద గల కల్యాణకట్ట ప్రాంతంలో దీక్షా పరుల మండపంలో నిత్యన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాటకంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చీరాలకు చెందిన భ్రమరాంబికా సేవా సమితి ఆధ్యర్యంలో 300 మంది సేవకులు తరలివచ్చి భక్తులకు సేవలందించారు.
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి మహాకుంభ సంప్రోక్షణ పర్వాలకు సోమవారం అర్చకులు ప్రాయశ్చిత్త హోమంతో.. పంచకుండాత్మక మహాయాగానికి శాంతికల్యాణం, రుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనాలతో ముగింపు పలికారు. ఆలయాన్ని ఆశ్రయించిన దిక్పాలకులైన ఆయా దేవతలకు బలిహరణ వేడుకల ద్వారా ప్రసాదాలను సమర్పించారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి, కుంభ ఉద్వాసన నిర్వహించారు. స్వయంభువుకు ప్రధానాలయంలో ప్రాణప్రతిష్ఠ చేపట్టారు. అనంతరం నేత్రోన్మిలనం, దృష్టికుంభం, అష్టబంధనం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం శాంతి కల్యాణం నిర్వహించారు. అనంతరం మహోత్సవంలో పాల్గొన్న పారాయణీకులు, ఆచార్యరుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనం నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ఈఓ ఎన్. గీత, ప్రధానార్చకులు నల్లన్ధీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, మొరింగంటి శ్రీధరాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కర్శర్మ, గట్టు శ్రవణ్కుమార్, గజవెల్లి రమేశ్బాబు పాల్గొన్నారు.