మనోహరాబాద్, నవంబర్ 12: ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని రామాయిపల్లి, కొనాయిపల్లి పీటీ, మనోహరాబాద్ గ్రామాల్లో సకల వసతులతో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు చివరి దశకు చేరుకున్నాయి. మొదటి విడుతగా 181 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే 90 శాతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. జీ ప్లస్ 2 పద్ధతిలో డబుల్బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. కొనాయిపల్లి పీటీలో విడివిడిగా ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారు.
మూడు గ్రామాల్లో 181 ఇండ్లు..
మనోహరాబాద్ మండలానికి మొదటి విడుతగా 181 ఇండ్లు మంజూరయ్యాయి. రామాయిపల్లిలో 72 ఇండ్లు, మనోహరాబాద్లో 72 ఇండ్లు, కొనాయిపల్లి పీటీలో 25 ఇండ్లు మంజూరవ్వగా వీటి నిర్మాణాలను ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షల వ్య యాన్ని ఖర్చు చేసి అన్ని వసతులతో నిర్మిస్తున్నారు.
రోడ్లు, మురుగు కాల్వలకు ప్రత్యేక నిధులు..
డబుల్ బెడ్ రూం ఇండ్లు చివరి దశకు చేరుకోవడంతో అధికారులు ఇండ్ల మధ్య రోడ్లు, అంతర్గత మురుగు కాల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా ఇండ్ల మధ్య ఖాళీ స్థలం వదిలారు. అందులో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. రామాయిపల్లిలో రూ. 52 లక్షలు, మనోహరాబాద్కు రూ. 50 లక్షలు, కొనాయిపల్లి పీటీ కి రూ. 16 లక్షలు అదనంగా మంజూ రు చేశారు. ఇండ్ల మధ్యలో వదిలిన 33 ఫీట్ల ఖాళీ స్థలంలో18 ఫీట్ల సీసీ రోడ్డు నిర్మించారు. మిగిలిన స్థలాన్ని హరితహారం మొక్కలకు, విద్యుత్ స్తంభాలకు, పార్కింగ్ కోసం ఉపయోగపడే విధంగా ప్లానింగ్ చేశారు. ఇప్పటికే రామాయిపల్లి, కొనాయిపల్లి పీటీ, మనోహరాబాద్ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
దరఖాస్తుల పరిశీలన …
మనోహరాబాద్, రామాయిపల్లి, కొనాయిపల్లి పీటీ గ్రామా ల్లో 181 ఇండ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రా మ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించి, గ్రా మస్తుల అభిప్రాయాలను సేకరించాం. దరఖాస్తుల పరిశీలన సైతం తుదిదశకు చేరుకున్నది.