కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 26: ప్రపంచంలోని ప్రముఖ సంస్థలన్నీ ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సుస్థిరమైన పాలన, పటిష్ఠమైన శాంతిభద్రతలే ఇందుకు కారణమని చెప్పారు. స్వరా ష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నదని తెలిపారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో శనివారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీషోను మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ఇండ్లను కొనుగోలు చేసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాలవారు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ప్రజలు కోనుగోలు చేసుకున్న స్థలాలు దురాక్రమణకు గురికావన్న నమ్మకాన్ని కల్పించడంతోపాటు కరీంనగర్ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడం, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, కేబుల్ బ్రిడ్జి, మెడికల్ కళాశాలల ఏర్పాటు ఇందుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. వెంచర్ల ఏర్పాటులో నిబంధనలను పక్కాగా పాటించాలని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు.. ఇండ్ల కొనుగోలుదారులకు సులభంగా రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ అడ్వర్టయిజ్మెంట్ జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్రావు, ఏజీఎం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొలి రోజే పోటెత్తిన సందర్శకులు
కరీంనగర్ జిల్లా చరిత్రలో ఇలాంటి ప్రాపర్టీషో ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్, కరీంనగర్కు చెందిన పలు రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటు ప్రముఖ బ్యాంకులు ఈ షోలో స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. ఇప్పటివరకు హైదరాబాద్ వంటి మహానగరాలకు మాత్రమే పరిమితమైన ప్రాపర్టీషో ఇప్పుడు కరీంనగర్లోనూ ఏర్పాటవడంతో తొలి రోజే సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వివిధ సంస్థల స్టాళ్లను సందర్శించి వాటి వెంచర్ల వివరాలను, రుణాల మంజూరుకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. సందర్శకులకు లక్కీ కూపన్ల ద్వారా బహుమతులు అందజేస్తుండటంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ గార్డెన్ కిక్కిరిసిపోయింది. స్టాళ్లన్నీ కిటకిటలాడాయి. రెండో రోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఈ ప్రాపర్టీషోకు సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నది.