ముంబై, ఆగస్టు 5: గృహ, వాహన తదితర రుణాల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. కీలక వడ్డీరేటును మరోసారి పెంచేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). శుక్రవారం ముగిసిన మూడు రోజుల ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇందుకు తగ్గట్టుగానే ఆయా రుణాల ఈఎంఐలు, కాలపరిమితులు పెరగనున్నాయి.
బ్యాంకులు ఈ మేరకు సవరణలు చేపట్టనున్నాయి. అధిక ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఆర్బీఐ ద్రవ్యసమీక్షల్ని చేస్తూపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా వడ్డింపుతో మే నెల నుంచి ఇప్పటిదాకా వరుసగా మూడుసార్లు రెపోరేటును పెంచినైట్టెంది. ఫలితంగా రెపోరేటు 5.4 శాతానికి చేరింది. ఇది కరోనాకు ముందున్న స్థాయి కంటే 0.25 శాతం ఎక్కువే కావడం గమనార్హం.
కరోనాతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్బీఐ రెపోరేటును తగ్గించి రుణ లభ్యతను సులభతరం చేసిన సంగతి విదితమే. రుణాలపై వడ్డీరేట్లు తగ్గడంతో గడిచిన రెండేండ్లలో గృహ, వాహన తదితర రుణాలు తీసుకున్న వారందరూ ఇప్పుడు ప్రభావితం కానున్నారు. గత మూడు నెలల్లో రుణాలపై వడ్డీరేట్లు 1.4 శాతం మేర పెరిగాయి మరి.
వరుసగా రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతుండటంతో రియల్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో ఆర్బీఐ రూపంలో షాక్ తగలనున్నదని వారు అంటున్నారు. గడిచిన మూడు నెలల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను 1.40 శాతం పెంచడంతో గృహ విక్రయాలు పడిపోయే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధర కలిగిన ఇండ్లను కొనుగోలు చేయాలనుకునేవారు వెనుకంజ వేసే అవకాశాలున్నాయని వారు అంటున్నారు.
సెంట్రల్ బ్యాంక్ తాజాగా మరో అర శాతం పెంచడంతో గృహ రుణాలపై వడ్డీరేటు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్ళనున్నాయని అనరాక్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. ఇక వడ్డీరేట్లు చారిత్రక కనిష్ఠ స్థాయి నుంచి పెరగడం ఆరంభమయ్యాయని, కరోనాతో కుదేలైన అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం సమంజసం కాదని ఆయన అన్నారు. మరోవైపు, ముడి సరుకులు ముఖ్యంగా సిమెంట్, స్టీల్, కార్మికుల ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై వడ్డీ పిడుగు పడ్డట్లు అయిందన్నారు.
అలాగే మరోసారి ఇండ్ల ధరలు పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. ఇప్పటికే పలు బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచాయని, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ముందస్తుగానే అంచనావేసినట్లు కోలియర్స్ ఇండియా సీఈవో రమేశ్ నాయర్ తెలిపారు. వడ్డీరేట్ల పెంపు గృహాల కొనుగోలుదారుల సెంటిమెంట్ను నీరుగారుస్తుందని, ముఖ్యంగా చౌక, మధ్యస్థాయి గృహాలపై ఇది ఎక్కువ ప్రభావం చూపనున్నదన్నారు. ఇప్పటికే చౌక గృహాల విక్రయాలు 11 శాతం తగ్గాయన్నారు.
‘భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు మారుపేరు. మహా సముద్రంలో ఎంతటి అలజడులు రేగినా ద్వీపం ఎలాగైతే నిలిచి ఉంటుందో.. అలాగే అన్నివైపులా ఎన్ని ఇబ్బందులు చుట్టుముట్టినా తట్టుకుని నిలబడే ఓ స్థూల ఆర్థిక స్థిర త్వ ద్వీపమే భారత్. ఊ హించని రెండు సంక్షోభాలు (కరోనా వైరస్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలను ఉద్దేశిస్తూ) వరుసగా ఎదురైనా దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపక వృద్ధిని ప్రదర్శిస్తున్నది. ఇక భారత్పై తైవాన్ పరిణామాలు ప్రభావం చూపబోవు. దేశ వాణిజ్యంలో తైవాన్ వాటా 0.7 శాతమే.
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
వడ్డీరేట్ల పెంపు ఇక్కడితో ఆగబోదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యసమీక్ష అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ.. విజృంభించిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మున్ముందు మరిన్ని పెంపులుంటాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులూ ద్రవ్యోల్బణ తీవ్రతకు కారణమేనన్నారు. కాగా, దేశంలో బియ్యం నిల్వలు మోతాదును మించి ఉన్నప్పటికీ.. ఈసారి తగ్గిన వరిసాగు విస్తీర్ణాన్ని దగ్గరగా గమనిస్తున్నామని చెప్పారు. ఇదిలావుంటే ఆయా అంశాల్లో సమస్యల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడానికి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలుసహా ఇంటర్నల్ అంబుడ్స్మన్ ఫ్రేమ్వర్క్ను విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.
రెపోరేట్ల పెంపును బ్యాంకులు తమ డిపాజిట్లకూ వర్తింపజేస్తున్నాయని, ఇది మున్ముందూ కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా దాస్ వ్యక్తం చేశారు. తద్వారా రుణాలతోపాటు డిపాజిట్లపైనా వడ్డీరేట్లు తప్పక పెరుగుతాయన్న సంకేతాలనిచ్చారు.
అయితే రుణాల వృద్ధికి ఆర్బీ ఐ నగదు నిల్వలపై బ్యాంకు లు ఎప్పటికీ ఆధారపడలేవని, మరిన్ని డిపాజిట్లు సేకరించి నగదును సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అప్పుడే డిమాండ్కు తగ్గట్టుగా రుణాల మంజూరు సాధ్యమవుతుందన్నారు. కాగా, డిపాజిట్దారులను ఆకట్టుకునేందుకు గతంలో ఎప్పుడూలేనంతగా వడ్డీరేట్లను బ్యాంకర్లు పెంచవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
‘ముందుగానే అంచనావేసినట్లు ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచింది. ఈ నిర్ణయం స్వల్పకాలంపాటు విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నప్పటికీ దీర్ఘకాలికంగా ఏ మాత్రం చూపదు’
– హర్ష వర్దన్, క్రెడాయ్ ప్రెసిడెంట్
‘రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను అర శాతం పెంచడంతో గృహ రుణాలు రెడ్ జోన్లోకి వెళ్ళనున్నాయి. చారిత్రక కనిష్ఠ స్థాయికి మంగళం పాడినట్లు అవుతున్నది. కరోనాతో ఢీలా పడిన అమ్మకాలకు ఆర్బీఐతో మరో షాక్ తగిలినట్లు అయింది’
– అనూజ్ పూరి, అనరాక్ చైర్మన్
‘ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ పలుదఫాలుగా వడ్డీరేట్లను పెంచుతున్నది’
– మదన్ సబ్నవీస్, బీవోబీ ప్రధాన ఆర్థికవేత్త
‘అంచనావేసిన దానికంటే ఆర్బీఐ వడ్డీరేట్లను అధికంగా పెంచింది. కరోనా ముందు స్థాయికి రెపో రేటును తీసుకొచ్చింది.
– ధర్మక్రితి జోషి, క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త