షాద్నగర్, నవంబర్ 16 : జిల్లాలోని స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్ను రంగారెడ్డి కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి అమయ్కుమార్ మంగళవారం విడుదల చేసి, వివరాలను వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. మొదటి రోజు ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ వేయలేదన్నారు. నామినేషన్ పత్రాలను పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నిర్వహణ అధికారికి అందజేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ అంశాలను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని ఆర్డీవో, తహసీల్దార్, మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. అదేవిధంగా అభ్యర్థులు కానీ, అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తులు కానీ ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అభ్యర్థులు సంబంధిత అధికారులతో తగిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.