కొత్తూరు, నవంబర్ 11 : అడవులను 33 శాతానికి పెంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాలంలో తెలంగాణకు హరితహారాన్ని చేపడుతున్నది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఏడు విడుతలుగా మొక్కలు నాటుతూ వచ్చారు. ఎనిమిదో విడుత హరితహారానికి నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిగ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసింది. పంచాయతీయే నర్సరీ నిర్వహణను చూసుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో ఏ గ్రామానికి కావాల్సిన మొక్కలు అదే గ్రామంలోని నర్సరీలో పెంచుతున్నారు.
కొత్తూరులో 2.58లక్షల మొక్కలు
కొత్తూరు మండలంలో మొత్తం 2.58 లక్షల మొక్కలు పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండలంలో 12 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉన్నది. ప్రతి గ్రామంలోని నర్సరీలో 18 వేల మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తూరు మున్సిపాలిటీ నర్సరీలో 42 వేల మొక్కలు పెంచుతున్నారు. ఈ నర్సరీని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఇటీవలే ప్రారంభించారు. ఇందులో 28 రకాల మొక్కలు పెంచుతున్నామని మున్సిపల్ కమిషనర్ వీరేందర్ తెలిపారు.
నందిగామలో 3.24 లక్షల మొక్కలు
నందిగామ మండలంలో 18 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో 3.24 లక్షల మొక్కలు పెంచేందుకు పనులు జరుగుతున్నాయి.
పనుల పర్యవేక్షణ..
ఉమ్మడి మండలంలోని అన్ని నర్సరీల్లో మొక్కల పెంపకానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోజూ ఒక గ్రామానికి వెళ్లి నర్సరీలో జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నా. ప్రతి గ్రామంలోని నర్సరీలో 18 వేల మొక్కలు పెంచేందుకు కవర్లలో మట్టిని నింపిస్తున్నాం. పని పూర్తి కాగానే నారు తెచ్చి కవర్లతో పెంచుతాం. మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో విత్తనాలు నాటుతాం.