ఇబ్రహీంపట్నం, నవంబర్ 11 : మున్సిపాలిటీల ప్రత్యేకాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. స్వచ్ఛతలో మేటిగా నిలిచింది. పారిశుధ్యంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా ఎంపికైంది. స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రగామిగా నిలిచి రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. విస్తరిస్తున్న కాలనీలతో పాటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఆదాయవనరులు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో అభివృద్ధిలో జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఉత్తమ మున్సిపాలిటీగా నిలిచింది.
పట్టణ ప్రగతితో మారిన రూపురేఖలు
ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో పాలకవర్గం దీనిని చాలెంజ్గా తీసుకున్నది. వార్డుల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రతివార్డుకు ఒక్క కమిటీని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో ఉన్న ఇబ్రహీంపట్నం, శేరిగూడ, ఖానాపూర్, సీతరాంపేట్ గ్రామాల్లో ఉన్న 24వార్డుల్లో పట్టణ ప్రగతిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హరితహారం, ఇంటింటికీ చెత్తసేకరణ, ప్రతి ఇంటికి తాగునీరు, రోడ్లను శుభ్రం చేయడం, పారిశుధ్యంలో ప్రజల భాగస్వామ్యం, తడి,పొడి చెత్తవేరుచేయడం, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాల్లో సత్ఫలితాలను సాధించారు.
ప్లాస్టిక్ నిషేధం వైపు మున్సిపాలిటీ..
మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంపూర్ణ ప్లాస్టిక్నిషేధం వైపు మున్సిపాలిటీ అడుగులు వేసింది. మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ఇతరత్రా వాణిజ్యపరమైన కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే అనర్థాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
అద్దాలను తలపించే రీతిలో రోడ్లు..
ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకే పారిశుధ్య సిబ్బంది రోడ్లను శుభ్రంచేసి చెత్తసేకరిస్తున్నారు. ప్రతిరోజు రోడ్లను శుభ్రం చేయడం ద్వారా మున్సిపాలిటీలోని ప్రతి వీధి అద్దాలను తలపిస్తున్నాయి.
మున్సిపాలిటీకి అవార్డు..
స్వచ్ఛ సర్వేక్షణ్ పనుల్లో భాగంగా ఢిల్లీస్థాయిలో వచ్చిన ప్రత్యేక బృందాలను ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఆకర్షించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రతి కార్యక్రమం ఈ బృందానికి నచ్చింది. రాష్ట్రంలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో గుర్తించిన అధికారులు, ఇబ్రహీంపట్నం కూడా ఒకటిగా నిలిచింది. దీంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రాష్ట్రపతి అవార్డు దక్కింది.
హరితహారంలో మున్సిపాలిటీ అగ్రగామి..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ హరితహారంలో అగ్రగామిగా నిలిచింది. పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా మున్సిపాలిటీయే తీసుకున్నది. ప్రత్యేకంగా నాలుగు నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి ఐదు మొక్కల చొప్పున పంపిణీ చేయడంతో పాటు వాటిని నాటించి సంరక్షించే బాధ్యతలు కూడా ఇంటి యాజమానులు తీసుకునే విధంగా అవగాహన కల్పించారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై ఏర్పాటు చేసిన డివైడర్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకరంగా మారాయి. ఇబ్రహీంపట్నం చెరువుకట్టపైన కూడా నాటిన మొక్కలు సత్ఫలితాలనిచ్చాయి. ఇప్పటికే సుమారు 40నుంచి 50వేల మొక్కలను నాటారు.
ఇంటింటికీ చెత్తసేకరణ..
ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీచేసి ఇండ్లలో చెత్తను ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి మున్సిపల్ సిబ్బంది, ట్రాక్టర్లు, ఆటోల ద్వారా క్రమం తప్పకుండా చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి వీధిని మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేపడుతున్నారు.
పట్టణ ప్రగతితో అభివృద్ధి
ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టడంతో మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందింది. పాలకవర్గంతో పాటు అధికారులు ఎంతగానో శ్రమించారు. వారికి ప్రజల భాగస్వామ్యం కూడా ఉపయోగపడింది. మున్సిపాలిటీ అన్ని కార్యక్రమాల్లో ముందంజలో ఉంది. ఢిల్లీనుంచి వచ్చిన సర్వేలో సాధించిన ప్రగతితో రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది.
సమష్టి కృషితో స్వచ్ఛత
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక కావడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై ప్రత్యేకించి తమ సొంత పనిగా భావించారు. మున్సిపాలిటీ రాష్ట్రపతి దృష్టిలోకి రావడం ఎంతో అదృష్టంగా ఉంది. పారిశుధ్యం, హరితహారం, చెత్తసేకరణ, వంటి కార్యక్రమాల్లో అగ్రగామిగా నిలిచింది. మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తాం.
సంపూర్ణ పారిశుధ్యం కోసం పబ్లిక్ టాయిలెట్లు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని రోడ్లలో మలమూత్ర విసర్జనను పూర్తిగా నిషేధించారు. రోడ్లపై మలమూత్రం విసర్జించిన వారికి జరిమానాలు కూడా విధించారు. రోడ్లపై మలమూత్ర విసర్జన చేయకుండా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 6 పబ్లిక్టాయిలెట్లను నిర్మించారు. ప్రభుత్వ దవాఖాన, పాతపోలీస్స్టేషన్, పాతబస్టాండు, మున్సిపల్ కార్యాలయం, డాక్బంగ్లా చౌరస్తా, సబ్స్టేషన్, పోలీస్స్టేషన్ల సమీపంలో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటుచేశారు. దీంతో మున్సిపాలిటీలో సంపూర్ణ పారిశుధ్యం సాధించింది.