టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు తెలుపనున్నారు. ఉదయం 10 గంటల నుంచే టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు.
రంగారెడ్డి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నా కార్యక్రమాలను తలపెట్టారు. జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచే టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించేందుకు నిర్ణయించారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా కలెక్టర్ వద్ద అనుమతి తీసుకొని ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రైతన్నకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ నేడు జిల్లా గులాబీ దండు కదలిరానుంది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన జ్వాల హస్తినకు తాకే విధంగా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
రైతులు నష్టపోవద్దన్నదే సీఎం కేసీఆర్ తపన
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో చేపట్టే ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న ధర్నాను టీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. శాంతియుత ప్రజా ఉద్యమంతో రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ నేడు రైతుల పక్షాన పోరుకు సిద్ధమైందన్నారు. రైతులు నష్టపోవద్దనే తపన సీఎం కేసీఆర్ది అన్నారు. రాష్ట్ర రైతాంగానికి గులాబీ దళం వెన్నుదన్నుగా నిలుస్తుందని, కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. యాసంగిలో పండే పంటను గుజరాత్లో మాదిరిగానే రాష్ట్రంలోనూ కొనుగోలు చేయాలన్నారు. రైతులు పండించిన పంటను లాభనష్టాలు చూడకుండా కొనుగోలు చేయాల్సిన కేంద్రం రైతులతో వ్యాపారం చేయాలని చూస్తుందన్నారు. ధర్నాలో ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, మార్కెట్ కమిటీ పాలకవర్గాలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు
పరిగి, నవంబర్ 11 : కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించనున్నాయి. కేంద్రం వడ్లు కొనుగోలు చేయలేమని చెప్పడంతో కేంద్రం వడ్లు కొనుగోలు చేసేదాక రైతుల పక్షాన పోరాటం చేసేందుకు టీఆర్ఎస్ నిర్ణయించింది. శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనున్నారు. నిరసన సెగలు ఢిల్లీకి తాకేలా ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరులో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేపట్టనున్నాయి. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ క్యాడర్కు ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేశారు.