హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో నేతలు ఓటర్లను ప్రలోభపెట్టడం చూశాం.. తాయిలాలు ప్రకటించడం విన్నాం.. బాబ్బాబూ అంటూ బతిమాలడం తిలకించాం.. చివరకు చిత్రవిచిత్ర విన్యాసాలతో ఓటర్లను ఆకర్షించే గిమ్మిక్కిలనూ చూశాం… కానీ ఓటేయని వారి ఇండ్లపై జేసీబీ, బుల్డోజర్లతో దాడి చేస్తామని హెచ్చరించే ప్రజాప్రతినిధిని ఎప్పుడైనా చూశారా? నిస్సిగ్గుగా… ఆ హెచ్చరికలను వీడియోలో చిత్రీకరించి జన బాహుళ్యంలోకి వదిలే నీచమైన రాజకీయాన్ని ఎన్నడైనా కన్నారా? ఈ హెచ్చరికలు చేసిన ఘనుడెవరో కాదు.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఓటర్లను బెదిరించిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యోగి దగ్గర వేలల్లో జేసీబీలు..
‘ఉత్తరప్రదేశ్లో జరిగిన రెండో విడుత పోలింగులో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. నా ఆలోచన ప్రకారమైతే.. సీఎం యోగి ప్రత్యర్థులు, శత్రువులు, యోగి మరోసారి అధికారంలోకి రావొద్దనేకునే వారు పెద్ద ఎత్తున ఇంటి నుంచి బయటికొచ్చి ఓట్లేశారు. అందుకే హిందూ సోదరులారా.. ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ ఉంది. మీరందరూ బయటికొచ్చి యోగికి ఓటు వేయండి. బీజేపీకి ఓటు వేయని వారికి ఒకటి చెప్పాలనుకుంటున్నా.. యోగి వేల సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లు తెచ్చి పెట్టిండు. ఎన్నికలు ముగిసిన తర్వాత యోగికి ఓటు వేయని ప్రాంతాలను గుర్తిస్తారు. ఎవరు ఓటు వేయలేదో వాళ్ల ఇండ్లకు జేసీబీలు, బుల్డోజర్లను పంపిస్తాం. వాటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసు కదా! యోగికి ఓటు వేయని ద్రోహులకు (గద్దార్) చెబుతున్నా.. ఉత్తరప్రదేశ్లో ఉండాలనుకున్నారా? లేదా? బిడ్డా.. యోగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి’ అని రాజాసింగ్ హెచ్చరించారు.
రాజాసింగ్ను అరెస్ట్ చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్కు ఓటేయని వారి ఇండ్లపై జేసీబీలు, బుల్డోజర్లతో దాడులు చేస్తామని బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యోగికి వ్యతిరేకంగా ఓట్లు వేయొద్దని బహిరంగంగా మాట్లాడితే అరెస్టు చేయకుండా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.