ఢిల్లీ, జూన్ 26:రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత ఆ పరిస్థితి తప్పింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఫలితంగా- ఉన్నచోటే స్మార్ట్ఫోన్ల ద్వారా రైల్వే టికెట్లను నిమిషాల్లో బుక్ చేసుకునే వెసలుబాటును ప్రయాణికులకు కల్పించింది.
దేశంలో అత్యధిక మంది యూజర్లు వినియోగించే వెబ్సైట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు. టికెట్లను బ్లాక్లో విక్రయించుకోవడానికి ఈ సౌకర్యాన్ని కూడా వదలట్లేదు. దీన్ని నివారించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త ప్రయోగానికి పూనుకున్నది. టికెట్లను బుక్ చేసుకోదలిచిన ప్రయాణికుల గుర్తింపు కార్డులతో ఐఆర్సీటీసీ వెబ్సైట్ను లింక్ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన చర్యలను ప్రారంభించామని కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు.
టికెట్ల బుకింగ్ వ్యవస్థ దుర్వినియోగాన్నినివారించడానికి అందుబాటులో ఉన్నటెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులోభాగంగా ప్రయాణికులు తమ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు కార్డుతో వెబ్సైట్కు లింక్ చేసుకునే వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు అరుణ్ కుమార్ తెలిపారు. వెబ్సైట్లో లాగిన్ అవ్వాలంటే- ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులతో లింక్ చేసుకోవడం తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.ఈ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించిన నెట్వర్క్ను రూపొందింస్తున్నామని అన్నారు. దీనికోసం ఆధార్ విభాగం అధికారులతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని ఆర్పీఎఫ్ డీజీ స్పష్టం చేశారు. నకిలీ టికెట్ల కొనుగోలుదారులను గుర్తించడానికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది మే నాటికి 14,257 మంది నకిలీలను అరెస్ట్ చేసినట్లు కూడా చెప్పారు. వారు బుక్ చేసిన నకిలీ టికెట్ల విలువ 28.34 కోట్ల రూపాయలని పేర్కొన్నారు.