న్యూఢిల్లీ, మార్చి 28: తుగ్లక్ లేన్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లా ఖాళీ చేయాలంటూ లోక్సభ కార్యదర్శి పంపిన నోటీస్లోని ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ అన్నారు. పక్షపాత బుద్ధితో నా హక్కులకు భంగం కలిగిస్తున్నా, మీ నోటీసులో పేర్కొన్న విషయాలకు కట్టుబడి ఉంటానని రాహుల్గాంధీ మంగళవారం లోక్సభ కార్యదర్శికి లేఖ రాశారు. లోక్సభ ఎంపీగా రాహుల్గాంధీపై అనర్హత వేటు విధించిన సంగతి తెలిసిందే. తుగ్లక్ లేన్లో కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ కార్యదర్శి సోమవారం రాహుల్గాంధీకి నోటీసు జారీచేశారు. ఈ నోటీస్పై స్పందిస్తూ.. నాలుగుసార్లు ఎంపీగా గెలవటం ద్వారా, ఈ బంగ్లాలో తనకు ఎన్నో మధురమైన స్మృతులున్నాయని అన్నారు. జెడ్ ప్లస్ భద్రత కలిగివున్న రాహుల్గాంధీ తుగ్లక్ లేన్లోని బంగ్లాలో 2005 నుంచి నివసిస్తున్నారు. లోక్సభ కార్యదర్శి నోటీసులను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీవ్రంగా ఖండించారు. అన్ని విధాలుగా రాహుల్గాంధీని బలహీనపర్చాలన్నది మోదీ సర్కార్ వ్యూహమన్నారు.