హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసేయండి.. రైతులు వాళ్ల ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకొంటరు. కేంద్రం ఎట్లాంటి లేఖ ఇచ్చేదే లేదు’ అని కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన రాష్ట్ర ఎమ్మెల్యే రఘునందన్రావు తెగేసి చెప్పారు. ‘గతంలో ఐకేపీ కేంద్రాలు లేకుంటే రైతులు ధాన్యం అమ్ముకోలేదా? ఐకేపీ కేంద్రాలు ఉంటే ఏంది.. పోతే ఏంది? రైతులు వారి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకొంటరు’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్టుగా వానకాలంలో మిగిలిన పంట సేకరణపై కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాతపూర్వక హామీ ఇచ్చేది లేదు..
వానకాలంలో మిగిలిన పంట సేకరణపై కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చే ప్రసక్తే లేదని రఘునందన్రావు చెప్పడంతో వానకాలంలో మిగిలిన ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తిసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఇదే విషయంపై మంగళవారం చర్చించారు. ఒకటి రెండు రోజుల సమయం కావాలని, అ తర్వాతే స్పష్టత ఇస్తామని కేంద్రమంత్రి కూడా చెప్పారు. అంతలోనే రఘునందన్రావు రాతపూర్వక హామీ ఇచ్చేది లేదని చెప్పారంటే, ఇప్పటికే కేంద్రం ఆ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతున్నదని పలువురు అంటున్నారు. ఇదే విషయాన్ని కేంద్రం పెద్దలు ఎమ్మెల్యే నోట చెప్పించారని, నేడో రేపో వారు కూడా ఇదే సంగతిని కుండబద్దలు కొడతారని తేల్చేస్తున్నారు.
వానకాలం, యాసంగికి తేడా తెలియని ఎమ్మెల్యే
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుకు వానకాలం, యాసంగి సీజన్లకు మధ్య తేడానే తెలియడం లేదు. రాష్ట్రం ఇవ్వాల్సిన గత వానకాలం సీజన్ బియ్యం ఎప్పుడో ఇచ్చేసింది. గత యాసంగికి సంబంధించి ఇప్పటికే అధికమొత్తం ఇవ్వగా మరికొంత ఇవ్వాలి. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం రాష్ట్రం యాసంగి బియ్యం ఇచ్చేది ఉంటే.. వానకాలం బియ్యం ఇంకా ఇవ్వలేదని మాట్లాడటం వ్యవసాయంపై ఆయన అవగాహన లేమిని ఎత్తిచూప్తున్నది.