సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): మహిళల సంరక్షణే ధ్యేయంగా రాచకొండ షీ టీమ్స్ పనిచేస్తున్నదని మహిళా సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్ అన్నారు. గత పదిహేను రోజుల్లో పట్టుబడిన 126 మంది ఆకతాయిలకు శుక్రవారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయం ఆవరణలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. బస్టాండ్లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, విద్యా సంస్థలు, ఇతర రద్దీ ప్రాంతాలలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. షీ టీమ్స్ నిఘాలో పలువురు పోకిరీలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారని తెలిపారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 148 ఫిర్యాదులు అందాయన్నారు.
మంచాల్ మండలంలో దసరా సెలవుల్లో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన బాధితురాలు తన మేన మామ ఇంటికి వెళ్లింది. బాలిక నిద్రపోయిన తరువాత ఆ బాలికపై మేనమామ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఇబ్రహీంపట్నం షీ టీమ్స్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశామన్నారు. మరో ఘటనలో.. పెదనాన్న కొడుకు అయిన అన్న నాలుగు సంవత్సరాలుగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.
తనను ప్రేమించాలని, లేదంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి సర్క్యూలేట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు వనస్థలిపురం షీ టీమ్స్ను ఆశ్రయించడంతో.. నిందితుడిపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. గత 15 రోజుల్లో 53 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు. వివిధ రకాలుగా యువతులు, మహిళలను వేధించే వారిపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.