సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి ఒకరు వస్తువు కొన్నారు.. మరొకరు ఇన్సూరెన్స్ పాలసీ చేశారు.. ఇంకొకరు షాపింగ్ చేశారు.. ఇలాంటి వారికి వారం పది రోజుల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. మీరు ఫలానా షాపింగ్ చేశారు.. మీరు ఫలానా కార్యాలయానికి వెళ్లారు.. మీకు లక్కీ లాటరీ తగిలింది.. మీ ఇన్సూరెన్స్కు బోనస్ వచ్చింది.. మీకు కావాల్సిన లోన్ ఇస్తాం.. అంటూ నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. ఈ వివరాలు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి.. నిందితులు ఎవరి ద్వారా సేకరిస్తున్నారు.. అనే విషయంపై రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. కోల్కత్తలోని నకిలీ కాల్ సెంటర్లపై దాడిచేసి ఏడుగురు తెలుగు టెలీకాలర్స్తో పాటు బీహార్కు చెందిన కీలక నిందితులను అరెస్ట్ చేశారు. జస్ట్ డయల్లో డాటా ప్రొవైడర్లు ప్రకటనలు ఇస్తూ.. కావాల్సిన డాటాను అందిస్తున్నారు. కోల్కత్త, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ సైబర్చీటర్స్ జస్ట్ డయల్, డార్క్ వెబ్ల నుంచి డాటాను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డాటా లీకేజీ రూట్ను గుర్తించి ఛేదించేందుకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు దృష్టిసారించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలతో సైబర్క్రైమ్ ఏసీపీ హరినాథ్, ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ బృందం డాటా లీకేజీల విషయంలో మూలాల వరకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
వ్యక్తిగత వివరాలకు భద్రత లేదు..
జస్ట్ డయల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్న వారికి డాటా ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కామర్స్ వెబ్సైట్స్, వివిధ రకాలైన యాప్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లావాదేవీలు నిర్వహించే కస్టమర్ కేర్ కేంద్రాలు, కొరియర్ కేంద్రాలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, జాబ్ పోర్టల్స్, షాపింగ్ మాల్స్.. తదితర మార్గాల్లో ప్రజలు ఇచ్చే వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డాటా లీక్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటితో పాటు భిన్న మార్గాలలో వివిధ పనుల నిమిత్తం డాటాను సేకరిస్తుంటారు. ఇలాంటి డాటాను బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తుంటారు. ఈ డాటాతో వ్యాపారం చేసే వారు చాలా మంది ఉంటారు. దీనిని సోషల్మీడియా వేదికగా విక్రయించే వాళ్లు కూడా కొందరున్నారు. మరికొందరు డార్క్ వెబ్ ద్వారా కూడా విక్రయించే వాళ్లు ఉంటారు.
వందలో ఐదుగురు మాత్రమే..
రాష్ర్టాలు, భాషల వారీగా డాటాను విక్రయిస్తున్నారు. డాటాను సేకరించి ఆయా రాష్ర్టాల భాషలకు చెందిన టెలీకాలర్స్ను నియమించుకొని బీహార్, కోల్కత్త వంటి ప్రధాన నగరాల్లో సైబర్నేరగాళ్లు నకిలీ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసే వారికి కూడాఎంత మోసం చేస్తే అంత కమీషన్ ఎక్కువగా వస్తుంది. ఈ ముఠా సభ్యులు ప్రతిరోజూ ఐదు నుంచి పది మందిని మోసం చేస్తుంటారని పోలీసులు గుర్తించారు. ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే పరిస్థితులను బట్టి ప్రాంతానికి కూడా మార్చేస్తున్నారని చెప్పారు. దీంతో వంద మంది నేరగాళ్లలో ఐదుగురు మాత్రమే చిక్కుతున్నారని పేర్కొన్నారు.