సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఒడిశా సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి.. కొబ్బరి బోండాల మాటున హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆలేర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురు నిందితుల నుంచి రూ. రెండు కోట్ల విలువజేసే 900 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, ఐదు సెల్ఫోన్లు, రూ.3,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలను వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన యోగేశ్ దత్తు గైక్వాడ్ ఈజీగా డబ్బు సంపాదించేందుకు గంజాయిని ఒడిశా, మల్కాన్గిరిలో కొనుగోలు చేసి, దానిని మహారాష్ట్రలో విక్రయించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా మల్కాన్గిరిలో గంజాయి సరఫరా చేసే వారిని సంప్రదించాడు. కిలో గంజాయి రూ.2,000 నుంచి రూ. 3,000 వరకు ఇచ్చేందుకు మల్కాన్గిరిలో గంజాయి సరఫరా చేస్తున్న కర్రయ్యతో కలిసి ఒప్పందం చేసుకున్నాడు.
ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన వికాస్ బాబన్ సాల్వే, వినోద్ చంద్ర వంకల్కర్, కిశోర్ తులసీరామ్ వాడేకర్, కోసచిట్టి బాబుతో కలిసి ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో వారం రోజుల కిందట గైక్వాడ్ సూచనల మేరకు మహారాష్ట్ర నుంచి డీసీఎం వ్యాన్లో ఆంధ్రప్రదేశ్ , ఈస్ట్గోదావరి జిల్లా రావులపాలెం చేరుకున్నారు. అక్కడ డీసీఎంలో కొబ్బరి బోండాలు లోడ్ చేసుకున్నారు. అక్కడ నుంచి ఒడిశా సరిహద్దులోని మల్కాన్గిరికి వెళ్లారు. అక్కడ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కర్రయ్యను కలిసి, అతడి వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లను తీసుకున్నారు. వాటిని డీసీఎం వ్యాన్లో కొబ్బరి బోండాల కింద దాచి పెట్టారు. ఈ నలుగురు నిందితులు డీసీఎంలో గంజాయి తీసుకొని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర బయలుదేరారు. సోమవారం ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందానికి వచ్చిన సమాచారంతో, ఆలేర్ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఆలేర్ చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కొబ్బరి బోండాలతో వస్తున్న డీసీఎం వ్యాన్ను ఆపి తనిఖీ చేశారు. అందులో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో వాహనంలో ఉన్న వికాస్ బాబన్, వినోద్, కిశోర్, కోస చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని మహారాష్ట్రలో రూ.15 వేల నుంచి రూ. 20 వేలకు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. గతంలో కూడా గంజాయి సరఫరా చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రధాన నిందితుడు గైక్వాడ్, గంజాయి సరఫరా చేస్తున్న కర్రయ్య పరారీలో ఉన్నారు. చిక్కిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరిని కూడా పట్టుకుంటామని సీపీ తెలిపారు. అరెస్టయిన నలుగురు నిందితుల వద్ద నుంచి రూ. రెండు కోట్ల విలువజేసే 900 కిలోల గంజాయి, ఒక డీసీఎం వ్యాన్, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో భవనగిరి డీసీపీ నారాయణరెడ్డి, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.