సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచ నగరాలకు దీటుగా తాము హైదరాబాద్ నగరాన్ని మలిచి ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా పవర్ ఐలాండ్గా మారిస్తే కాంగ్రెసోళ్లు మాత్రం కరెంటు కోతలతో తెలంగాణ పరువు తీశారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి తమ పార్టీకే ఓటువేశారని నగరవాసులను కొనియాడారు. మంగళవారం నాడు టీవీ9 చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏమన్నారంటే ‘ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చాం. పవర్ ఐలాండ్గా మార్చే క్రమంలో భాగంగా నేషనల్ గ్రిడ్లోకి చేర్చాలని నిర్ణయించాం. రాష్ట్రంలో అన్ని జెన్కో స్టేషన్లతో, బయటి నుంచి మనం తీసుకుంటున్న పవర్ లైన్లతో హైదరాబాద్ను కనెక్ట్ చేశాం. ఉదాహరణకు కొత్తగూడెంలో ఏదైనా కారణం చేత జెన్కోలో కరెంటు ఉత్పత్తి కాకపోయినా, రామగుండం నుంచి సరఫరా అవుతుంది. ఈ రెండే కాదు మరో చోట నుంచి పవర్ వచ్చేలా ఒక రింగును ఏర్పాటు చేసి దానికి అనుసంధానం చేశాం. ఇదే పద్ధతిలో హైదరాబాద్ నగరానికి కూడా అన్ని వైపులా కనెక్ట్ చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా వ్యవస్థను క్రమబద్ధీకరించాం. ప్రతిసారి రెండు విషయాలను బిజినెట్ మీట్లలో చెప్పేవాన్ని.
యూ మే సీ ఇన్ పవర్ కట్ ఇన్ న్యూయార్క్! యూ మే సీ ఇన్ పవర్ కట్ ఇన్ లండన్! బట్ నాట్ ఇన్ హైదరాబాద్ (న్యూయార్క్లో పవర్ కట్ ఉండొచ్చు. లండన్లో కరెంటు పోవచ్చు. కానీ హైదరాబాద్లో పవర్కట్ చాన్సే లేదు) అని చెప్పాను. రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా ఉంటే ఎన్నో బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. మా ప్రభుత్వంలో అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేశాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. విద్యుత్ రంగంపై అవగాహన లేమి, అసమర్థతతో విద్యుత్ రంగంలో తెలంగాణ పరువు తీశారు. విద్యుత్ రంగంలో ఐఏఎస్ల కన్నా అతి ఎక్కువ అనుభవం ఉన్న టెక్నో క్రాట్స్కు ఈ విద్యుత్ సంస్థలను అప్పగించాను. ఈ రంగంలో పై నుంచి కిందిస్థాయి వరకు టెక్నో క్రాట్స్ ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే టెక్నో క్రాట్స్ను తొలగించి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జెన్కో, ట్రాన్స్కో రంగాల్లో ఐఏఎస్ ఆఫీసర్లను నియమించింది. ఐఏఎస్ అధికారులు అసమర్థులని నేను నిందించను. వారు పరిపాలనా రంగంలో బాగా పనిచేస్తారు. కానీ విద్యుత్ లాంటి ప్రత్యేక రంగంలో టెక్నోక్రాట్స్ ఇంకా బాగా పనిచేస్తారు. మొన్నటి వరకు.. తెలంగాణలో పవర్ బాగుంటుందని చెప్పుకునే పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో మార్కెట్లో తెలంగాణ పరువు ఘోరంగా పోయింది’ అని చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని చూసి నగరవాసులు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించారని చెప్పారు.