కంటోన్మెంట్, ఏప్రిల్ 23 : కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ఐదుసార్లు తన తండ్రి సాయన్న, ఒకసారి తన చెల్లెలు లాస్యనందిత భారీ మెజార్టీతో గెలుపొందారని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యుల సహకారంతో రాబోయే రోజుల్లోనూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వెళ్లిన వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత తల్లి గీత, బోర్డు మాజీ సభ్యులు అనితాప్రభాకర్, పాండుయాదవ్, సీనియర్ నాయకులు పనస సంతోష్ తదితరులు ఉన్నారు.