కాచిగూడ, నవంబర్ 21 : రాజస్థాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ర్టాల్లో ప్రకటించని బీసీ ముఖ్యమంత్రి నినాదం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడంలో మోదీ ప్రభుత్వ అంతర్యమేమిటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన మంగళవారం రాత్రి కాచిగూడలోని అభినందన్ హోటల్లో బీసీ సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి కంటే ముందు పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో 54 శాతం బీసీలు ఉన్నారని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, రాజ్కుమార్, సురేశ్, సుధాకర్, పృథ్వీగౌడ్, కిరణ్, నాగేశ్వర్రావు,శ్రీకాంత్ పాల్గొన్నారు.