ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 27 : పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మున్సిపల్ కార్యాలయంలో పుర ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అప్పటికప్పుడు పలువురి సమస్యలను ప్రజావాణిలో పరిష్కరించారు. పట్టణ ప్రజల ఇక్కట్లను తొలగించి, వారికి భరోసా కల్పించే లక్ష్యంతో పుర ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తం 27 అర్జీలు వచ్చాయని కమిషనర్ శైలజ తెలిపారు. ఇందులో రెవెన్యూ-11, టౌన్ ప్లానింగ్-7, ఇంజినీరింగ్-7, శానిటేషన్-1, మెప్మా-1 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పుర ప్రజావాణితో పేదలకు మేలు…
పేద, మధ్య తరగతి వారికి ఎక్కువగా మున్సిపల్కు సంబంధించిన పనులు ఉంటాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ యంత్రాంగం పుర ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం మా లాంటి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నేను మా ఇంటికి సంబంధించిన ట్యాక్స్ చెల్లింపు పునరుద్ధరణ కోసం ఈ రోజు పుర ప్రజావాణికి వచ్చాను. అధికారులు నా అర్జీని స్వీకరించి రసీదు ఇచ్చారు. త్వరలో ఇంటి ట్యాక్స్ ఆప్డేట్ అవుతుందని భరోసా ఇచ్చారు. – బొంకూరి ఊశన్న, అనుకుంట
అందరికీ ప్రయోజనం..
పట్టణంలోని ప్రతి వాడకు సంబంధించిన ప్రజలకు మౌలిక వసతుల పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారానికి వారంలో ఒక రోజు మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి ఏర్పాటు చేయడంతో అధికారులకు మా సమస్యలు పరిష్కరించడం సులువవుతుంది. మాక్కూడా నిర్భయంగా అధికారులకు సమస్యలు చెప్పేందుకు వీలవుతుంది. మా ఇంటి ఆస్తి పన్ను చెల్లింపుదారు పేరు సవరణ కోసం అర్జీ పెట్టుకున్నాను. పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. – అబ్దుల్ రహీం, అంబేద్కర్ నగర్