న్యూఢిల్లీ : యూట్యూబ్ వేదికగా ఆన్లైన్ స్కామ్స్టర్లు చెలరేగుతున్నారు. యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే అధిక మొత్తంలో ఆదాయం ఆర్జించవచ్చని మభ్యపెడుతూ సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) ఓ మహిళ నుంచి ఏకంగా రూ. 24 లక్షలు కాజేశారు. పుణేలోని ఎఫ్సీ రోడ్లో ఆప్తమాలజిస్ట్గా పనిచేసే మహిళను మార్చి 28 ఏప్రిల్ 22 మధ్య సైబర్ నేరగాళ్లు మోసగించారు.
యూట్యూబ్ వీడియోలను చూడటం వంటి ఆన్లైన్ టాస్క్లతో భారీగా ఆర్జించవచ్చని మభ్యపెట్టిన స్కామర్లు అందినకాడికి దోచుకున్నారు. వర్క్ ఫ్రం హోం ఆఫర్ పేరుతో మహిళను సంప్రదించిన స్కామర్లు యూట్యూబ్ వీడియోలకు లైక్ బటన్ ప్రెస్ చేస్తే పెద్దమొత్తంలో ఆదాయం అందిస్తామని నమ్మబలికారు. టాస్క్లను పూర్తిచేసేందుకు తొలుత బాధితురాలు రూ. 10,275 చెల్లించారు. బాధితురాలి విశ్వాసం చూరగొన్న స్కామర్లు ఆమెకు కొన్ని ప్రీపెయిడ్ టాస్క్లు అప్పగించి తమ క్రిప్టోకరెన్సీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆకర్షణీయమైన రిటన్స్ వస్తాయని మభ్యపెట్టారు.
దీంతో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో మహిళ రెండు బ్యాంకు ఖాతాలకు రూ. 23.83 లక్షలను బదిలీ చేశారు. ఆపై క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్మెంట్ను విత్డ్రా చేయాలని మహిళ నిర్ణయించగా, ఆమె పేమెంట్ను రిలీజ్ చేసేందుకు స్కామర్లు రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే తరహాలో పుణేకు చెందిన ఓ ఇంజనీర్ నుంచి ఆన్లైన్ టాస్క్ల పేరుతో స్కామర్లు రూ. 9 లక్షలు దోచేశారు.
Read More