ముంబై, అక్టోబర్ 13: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. గడిచిన 11 ఏండ్లలో రూ.1.29 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ బాకీలు ఎవరెవరివి? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేమని చెప్పింది. పుణేకు చెందిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త వివేక్ వేలంకర్ దాఖలు చేసిన పిటిషన్కుగాను రద్దు చేసిన నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) వివరాలను బ్యాంక్ తెలియజేసింది. కానీ ఆ అప్పులను ఎగ్గొట్టినవారి పేర్లను చెప్పలేదు.
కాగా, ఏ చట్టాన్ని గౌరవించి రద్దు చేసిన మొండి బకాయిల విలువను చెప్పిందో.. అదే చట్టంలోని ఓ క్లాజును పేర్కొంటూ రుణ ఎగవేతదారుల గురించి చెప్పబోమంటూ బ్యాంక్ తప్పించుకోవడం గమనార్హం. 2011-12 నుంచి 2021-22 మధ్య మొత్తం రూ.1,29,088 కోట్ల విలువైన మొండి బకాయిలను మాఫీ చేసినట్టు ఆర్టీఐ పిటిషన్కు బ్యాంక్ జవాబిచ్చింది.
అయితే ఇదే ఆర్టీఐ చట్టంలోని 8(1)(j) సెక్షన్ కింద డిఫాల్టర్ల పేర్లను బహీర్గతం చేయలేమన్నది. వ్యక్తిగత వివరాలను బయటకు చెప్పడం వల్ల వారికి ముప్పు రావచ్చన్న భయాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టీఐ అభ్యర్థనను నిరాకరించినట్టు బ్యాంక్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈ సందర్భంగా చెప్పారు. రద్దయిన రుణాల్లో రూ.100 కోట్లకుపైగా ఉన్నవారి వివరాలను చెప్పాలంటూ వేలంకర్ ఆర్టీఐ కింద కెనరా బ్యాంక్ను కోరారు.