మల్కాజిగిరి, నవంబర్ 19 : ప్రభుత్వ స్కూల్లలో ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తుండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరిలోని ప్రభుత్వ బాలబాలికల స్కూల్, నేరేడ్మెట్లోని ప్రభుత్వ ప్రాథమిక స్కూల్, యాప్రాల్లోని ప్రభుత్వ స్కూల్, ఓల్డ్ సఫిల్గూడలోని ప్రభుత్వ స్కూల్, బీజేఆర్ నగర్లోని ప్రభుత్వ స్కూల్, మౌలాలి గాంధీనగర్, అల్వాల్లోని ప్రభుత్వ స్కూల్లలో ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూల్లో ఫీజులు కట్టలేని వారు తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్య ఉండడంతో పంపిస్తున్నారు. ఉపాధ్యాయులు బడి బాటలో కాలనీల్లో ర్యాలీగా తిరిగి ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి తీసుకువచ్చి ఇక్కడ చేర్పించారు. సీఎం కేసీఆర్ ఇంగ్లిష్ చదువులతో పాటు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం తరగతులతో పాటు పోషకాహారాలతో మధ్యాహ్నం భోజనం అందజేస్తున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డు , నాణ్యమైన వంటకాలతో విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఎదుగడానికి సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. పప్పు, కూరగాయలు, సాంబారుతో కూడిన భోజనం పెడుతున్నారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థుల శారీరక ఎదుగుదలని తరచూ పరిశీలిస్తున్నారు. స్కూల్లో చేర్పించినప్పటి నుంచి ప్రస్తుతం శారీరకంగా పెరుగుదల బాగున్నట్లు గుర్తించారు. విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్, నోట్ బుక్స్తో పాటు యూనిఫాం ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు చదువుల పరిస్థితులను అధికారుల పర్యవేక్షిస్తున్నారు. పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు రాణించాలంటే విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. దీంతో ఇంగ్లిష్ మీడియంలో బోధనలతో పాటు మధ్యాహ్నం భోజనం సజావుగా జరుతున్నాయి. ప్రస్తుతం అన్ని స్కూల్లలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. వచ్చిన ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ఇస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో 11,575 మంది విద్యార్థులు
నియోజక వర్గంలోని 50 ప్రభుత్వ స్కూళ్లలో 11,575 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉర్దూ మీడియంలో 27 మంది ఉన్నారు. వీరికి ఉచితంగా టెక్ట్స్, నోట్ బుక్స్, యూనిఫాంతో పాటు మధ్యాహ్నం భోజనం అందజేస్తున్నాం. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. కంప్యూటర్ క్లాసులో విద్యార్థులు చక్కగా నేర్చుకుంటున్నారు.
మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం
ప్రభుత్వ స్కూల్స్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది. అవకాశాన్ని అందరూ వినియోగించు కోవాలి. స్కూళ్లల్లో సర్వే చేయించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.