సిద్దిపేట పోలీస్ కమిషనర్గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన జోయల్ డెవిస్
తన మార్క్ చూపించిన పోలీస్ బాస్
ప్రముఖుల జిల్లాలో శాంతిభద్రతల సంరక్షణలో కీలకంగా వ్యవహరించిన జోయల్
నూతన పోలీసు కమిషనర్గా శ్వేత.. కామారెడ్డి నుంచి బదిలీ
మెదక్ ఎస్పీగా సత్తాచాటిన దందనదీప్తి
ఐదేళ్లలో శాంతిభద్రతల పర్యవేక్షణలో కఠినంగా విధులు నిర్వహణ
అక్రమాలపై ఉక్కుపాదం మోపిన చందనదీప్తి
హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా బదిలీ
మెదక్ జిల్లా ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని నియామకం
మెదక్/సిద్దిపేట టౌన్, డిసెంబర్ 25 : సిద్దిపేట పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించిన జోయల్ డెవిస్, మెదక్ ఎస్పీ గా పనిచేసిన జి.చందనదీప్తి విధి నిర్వహణలో తమదైన ముద్ర వేశారు. వీరిద్దినీ ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేయడంతో వారందించిన సేవలను జిల్లా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
ప్రత్యేక ముద్ర వేసిన జోయల్ డెవిస్…
సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఏర్పాటైన సమయంలో మొదటి సీపీగా శివకుమార్ పనిచేశారు. ఆయన బదిలీ అయిన అనంతరం 2018లో సిద్దిపేటకు రెండో పో లీసు కమిషనర్గా జోయల్ డెవిస్ నియామకమయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఇక్కడ విధులు నిర్వర్తించడం సవాళ్లతో కూడుకున్న విషయం. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఆయన విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చాకచక్యాన్ని ప్రదర్శించారు. మూడున్నర ఏండ్ల కాలంలో అనేక సంస్కరణలు జిల్లాలో అమలు చేసి చూపించారు. ముఖ్యంగా పోలీసుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలీసు వెల్ఫేర్ కన్వెన్షన్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చారు. సెంటర్ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించి అన్ని హంగులతో నిర్మింపజేశారు. కమిషనరేట్లో పోలీసు వెల్ఫేర్ స్టోర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే మోడల్ పోలీసు స్టేషన్ను మర్కూక్లో నిర్మించి ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నేరాలను నియంత్రించారు. విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్ వ్యవస్థను ఆయన హయాంలోనే పటిష్ట పర్చారు. ప్రజల భధ్రతకు పెద్దపీట వేస్తూ నేరస్తులను పట్టుకునేందుకు జిల్లా వ్యాప్తంగా అత్యధిక మార్లు కార్డ్డన్ సెర్చ్ నిర్వహించి నేరాల నియంత్రణలో ప్రధాన భూమిక పోషించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలోను ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కఠినంగా అమలు పర్చారు. జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించి ఆయన మార్క్ చూపారు. ఎక్కడా పనిచేసినా తనదైన పనితీరుతో అటు అధికారులు, ప్రజల మన్ననలు అందుకున్నారు.
సిద్దిపేట నూతన పోలీసు కమిషనర్గా శ్వేత…
తెలంగాణ సర్కారు భారీ ఎత్తున ఐపీఎస్లను బదిలీ చేస్తూ శనివా రం ఉత్తర్వులు జారీ చేసి సంగతి తెలిసిందే. సిద్దిపేట పోలీసు కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జోయల్ డెవిస్ను హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీగా బదిలీ చేసింది. అదే సమయంలో కామారెడ్డి ఎస్పీగా పనిచేస్తున్న ఎన్.శ్వేతను సిద్దిపేట పోలీసు కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, శ్వేత ఇది వరకు కొన్ని రోజుల పాటు సిద్దిపేట ఇన్చార్జి పోలీసు కమిషనర్గా పనిచేశారు. సోమవారం రోజున పోలీసు కమిషనర్గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.
మెదక్ జిల్లా తొలి ఎస్పీగా..
మెదక్ జిల్లా కొత్తగా ఏర్పాటైన తర్వాత ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జి.చందనదీప్తి జిల్లాపై తనదైన ముద్ర వేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాకు శాంతిభద్రతలు ఎంతో సవాల్గా మారిన తరుణంలో, అన్ని పోలీస్స్టేషన్లను సమన్వయంతో నడిపిస్తూ.. ప్రజాప్రతినిధులందరి సహకారంతో జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చారు. మెదక్ జిల్లాగా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన చందనదీప్తి శుక్రవారం హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారిగా మెదక్ జిల్లా ఎస్పీగా అక్టోబర్ 11, 2016లో తొలి పోస్టింగ్తో పనిచేశారు. జిల్లా ఎస్పీగా చందనదీప్తి విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందారు. జిల్లాలో చోటు చేసుకున్న ఎన్నో కీలక పరిణామాల్లో సత్వరం స్పందించి ప్రజల మన్ననలు పొందారు. జిల్లాలో ఈ ఐదేండ్ల కాలంలో ముఖ్యంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు నేర నియంత్రణకు కృషి చేశారు. గంజాయి, గుట్కా రవాణాపై ఉక్కుపాదం మోపేలా పోలీసులను పరుగులు తీయించారు. ఇసుక అక్రమ రవాణా పెరగకుండా అడ్డుకున్నారు. కరోనా-లాక్డౌన్ సమయంలో ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా ఎప్పటికప్పుడు గస్తీ పకడ్బందీగా కొనసాగేలా పర్యవేక్షించారు.
ఎస్పీగా తొలిసారి ఇక్కడే..
మెదక్ జిల్లా తొలి మహిళా ఎస్పీగా చందనదీప్తి 2016, అక్టోబర్ 11న నియమితులయ్యారు. 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి చందనదీప్తి వికారాబాద్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం కొత్తగా ఏర్పాటైన మెదక్ జిల్లాకు ఎస్పీగా తొలి పోస్టింగ్ తీసుకున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ప్రతి సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. జిల్లాలోని ప్రజలు ‘ప్రజావాణి’లో అర్జీలు సమర్పించగానే, వెంటనే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సైబర్ నేరాలను అదుపు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో మూడంచెల వ్యవస్థ పనిచేసింది. డయల్ 100కి కాల్తో పాటు రోడ్డు ప్రమాదాలు, సైబర్, ఆర్థిక నేరాలు, షీటీం, టాస్క్ఫోర్స్, మహిళల భద్రత, మిస్సింగ్ కేసులు, ఈ చలాన్లు, పెండింగ్ కేసులు, నాన్ బెయిలెబుల్ వారెంట్లు, కోర్టు కేసులు తదితర వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు.
మెదక్ జిల్లా రెండో మహిళా ఎస్పీగా
రోహిణి ప్రియదర్శిని..
మెదక్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలి ఎస్పీగా చందనదీప్తి ఐదేండ్లు విధులు నిర్వర్తించారు. సైబరాబాద్ క్రైం డీసీపీగా పనిచేస్తున్న 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి రోహిణి ప్రియదర్శిని మెదక్ జిల్లా రెండో మహిళా ఎస్పీగా బదిలీపై వచ్చారు. జిల్లాలో అక్రమ వ్యాపారాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.