మహబూబ్నగర్ : ఉచిత న్యాయ సహాయం, న్యాయపరమైన హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం నుంచి నవంబర్ 14 వరకు గ్రామాల్లో ‘పాన్ ఇండియా అవేర్నెస్, అవుట్ రీచ్’ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ప్రేమావతి పేర్కొన్నారు. ఆర్థికంగా, సామాజిక వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఏ ప్రకారం ఉచిత న్యాయం అందించాలని పేర్కొందన్నారు. న్యాయం అవసరమైన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేయడం, వారికి న్యాయపరమైన హక్కులు, సేవలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఉచిత న్యాయం, లోక్ అదాలత్ ద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి ఉద్దేశించి నిర్వహిస్తున్న పాన్ ఇండియా అవేర్నెస్ అవుట్ రీచ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మహబూబ్నగర్ జిల్లా కోర్టు ఆవరణ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించిన ప్రభాత్ భేరిని ఆమె ప్రారంభించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు నుంచి జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు గ్రామాల్లో లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు హనుమంతు, మొదటి అదనపు జడ్జి టి.రఘురామ్, రెండో అదనపు జడ్జి కే ఉమాదేవి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్ వెంకట్రామ్, మొబైల్ మెజిస్ట్రేట్ తేజో కార్తిక్, స్పెషల్ ఏఎంఎఫ్ ( ఎక్సైజ్ ) జడ్పి శిరీష, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ సంధ్యారాణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనార్దన్, గవర్నమెంట్ ప్లీడర్ మనోహర్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, కార్యదర్శి నాగభూషణం తదితరులుపాల్గొన్నారు.