“అది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమ కాలం. కేసులు లెక్కచెయ్యలేదు. జైలు గోడలు నన్ను ఆపలేదు. లాఠీ దెబ్బలకు జడవలేదు. రాష్ట్రం ఏర్పాటు కాకపోతే బతుకు ఆగమని ఆనాడు పలువురు హెచ్చరించినా వెనకడుగు వేయలేదు. నా నేల కోసం జరుగుతున్న పోరాటంలో ప్రాణం పోయినా ఫరవాలేదు అని నిశ్చయించుకున్న. నా దేవుడు కేసీఆర్ ఇచ్చిన ప్రతి పోరాట పిలుపు విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించా. నాపై 33 కేసులు. ఇప్పటికీ 3 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నా పాస్పోర్ట్ను మూడుసార్లు అధికారులు సీజ్ చేశారు. ఎట్టకేలకు ఉద్యమ రథసారథి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్నాం. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా నష్టపోయిన తెలంగాణ నేడు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. పాలించుకోవడం తెలియదు అని విమర్శించినోళ్లకు స్ఫూర్తివంతమైన పథకాలతో జవాబు ఇస్తున్నాం.” అని కట్టెల శ్రీనివాస్ యాదవ్ తన ఉద్యమ చరిత్రను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు.
ఏడేళ్లలో అద్భుత కార్యక్రమాలు..
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ జరిపిన అనేక పోరాటాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 74 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దేశ పాలనలో జరగని అభివృద్ధి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో కేవలం ఏడేళ్ల కాలంలో జరిగింది. వందల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధి అనేది కండ్ల ముందు కనిపిస్తుంది. నేను గత ముఖ్యమంత్రులు, మంత్రుల్ని చూశాను. కాని, సీఎం కేసీఆర్ విజన్లో మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పొందుతున్నారు. 24 గంటల నిరంతరం, హరితహారం, ఫుట్పాత్ల అభివృద్ధి, వైట్ టాప్ రోడ్లు, స్టీల్ బ్రిడ్జిలు, తడి – పొడి చెత్త కార్యక్రమంతో అనేక సంక్షేమ పథకాలతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. వివిధ రకాల అనుకూలతలు ఉన్న మినీ భారత్ కావడంతోనే ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ అయినందున నగరంలో శాంతిభద్రతలకు చిన్న విఘాతం కూడా లేదు. పెట్టుబడిదారులకు కూడా కావాల్సిన ప్రమాణాలు ఇవే.
మంత్రి కేటీఆర్ నాకు ఆదర్శం..
నేను ప్రజారాజ్యం పార్టీ గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న సమయం లో ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమైక్య రాష్ర్టానికి మద్దతు ఇవ్వడంతో, ఆనాడు స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలో చేరాను. నా తండ్రి లాంటి కేసీఆర్ దిశానిర్దేశంతో పార్టీ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. గాంధేయ మార్గాన్ని అనుసరించి టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఉండేది. రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దూసుకుపోతుంది. శాంతిభద్రతలు, విద్య, వైద్య, ఐటీ రం గాల్లో రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు దిక్సూచిగా నిలిచింది. మంత్రి కేటీఆర్ నాకు ఆదర్శం. యువ నాయకుడి విజన్తో ఐటీ ప్రపంచ దృష్టి ఆకర్శించింది. కేటీఆర్ నన్ను గైడ్ చేసేవారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అక్కడ నన్ను ఇన్చార్జిగా నియమించి పార్టీ నాకు గుర్తింపు నిచ్చింది. మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలను క్లీన్స్వీప్ చేయడంలో విశేషంగా కృషి చేసినందుకుగానూ మంత్రి కేటీఆర్ అభినందించారు.